వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 74 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగింది. ముఖ్యంగా చివరి 6 బంతుల్లో 5 బౌండరీలు బాది జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించింది.
యూపీ వారియర్స్ బౌలర్ సోఫీ ఎక్లిస్టోన్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు బౌండరీలు బాదిన బెత్ మూనీ.. నాలుగో బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నం చేసింది. కానీ నాన్ స్ట్రైకర్ షబ్నమ్ రనౌట్ అయ్యింది. తర్వాతి 2 బంతులను బెత్ మూనీ బౌండరీకి తరలించింది. ప్రస్తుతం ఆమె బ్యాటింగ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

బెత్ మూనీ సూపర్ బ్యాటింగ్తో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. బెత్ మూనీతో పాటు లౌరా వోల్వార్డ్(30 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 43) రాణించింది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్(3/38) మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ(2/22) రెండు వికెట్లు పడగొట్టింది.
రాజేశ్వరి గైక్వాడ్, చమరి ఆటపట్టుకు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన యూపీ వారియర్స్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. షబ్నమ్ మూడు వికెట్లతో చెలరేగడంతో యూపీ టాపార్డర్ కుప్పకూలింది. అష్లే గార్డ్నర్, కత్రిన్ బిర్స్ తలో వికెట్ తీసారు. యూపీ బ్యాటర్లలో కెప్టెన్ అలిస్సా హీలీ(4), కిరణ్ నావిగిరే(0), చమరి ఆటపట్టు(0), గ్రేస్ హ్యారీస్(1), శ్వేత సెహ్రావత్(1) దారుణంగా విఫలమవ్వగా.. దీప్తి శర్మ(21 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తోంది.
ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ చేరగా.. మూడో స్థానం కోసం ఆర్సీబీ, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన గుజరాత్ జెయింట్స్ ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసింది.
ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రస్తుతం యూపీ వారియర్స్తో జరుగుతున్న మ్యాచ్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో మెరుగైన రన్రేట్తో గెలవాలి. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ జరిగే తమ ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ చిత్తవ్వాలి. యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ మెరుగైన రన్ రేట్తో గెలవాలి. మరోవైపు ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడాలి.
లీగ్ దశ ముగిసిన తర్వాత అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధించనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచి జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి జట్టు ఫైనల్లో తలపడనుంది.