WPL 2024 Auction: వన్డే ప్రపంచకప్ 2023 ముగియడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్పై ఫోకస్ పెట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్తో పాటు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ల నిర్వహణపై కసరత్తు మొదలుపెట్టింది. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ను నిర్వహించనుంది.
ఈ క్రమంలోనే డబ్ల్యూపీఎల్ మినీ వేలానికి బీసీసీఐ ముహుర్తం ఫిక్స్ చేసింది. డిసెంబర్ 9న ముంబై వేదికగా మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మినీ వేలాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. డబ్ల్యూపీఎల్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాన్ని పంచుకుంది.

గతేడాదే మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు జట్లతో ప్రారంభమైన వుమెన్స్ ప్రీమియర్ లీగ్ సూపర్ సక్సెస్ అయ్యింది. గతేడాది డబ్ల్యూపీఎల్ మ్యాచ్లన్నీ ముంబైకి మాత్రమే పరిమితమవ్వగా.. ఈసారి దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది.
ఫ్రాంచైజీల హోమ్ గ్రౌండ్స్లో ఐపీఎల్ తరహాలో మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లంతా ఆసక్తి చూపుతున్నారు. ఈ లీగ్ ద్వారా భారీ ఆదాయం రావడంతో పాటు గుర్తింపు కూడా వస్తుండటంతో లేడీ క్రికెటర్స్ ఎగబడుతున్నారు.
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ వేలాన్ని దుబాయ్లో నిర్వహిస్తారని ప్రచారం జరిగినా.. ముంబైలోనే నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ప్రతీ ఫ్రాంచైజీ రూ.13.5 కోట్ల పర్స్ మనీతో వేలంలో పాల్గొననున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల లిస్ట్ను అందజేసాయని బీసీసీఐ స్పష్టం చేసింది.
60 మంది ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీలు 29 మందిని రిలీజ్ చేశాయని, ఇందులో 21 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారని పేర్కొంది. అత్యధికంగా గుజరాత్ జెయింట్స్ 11 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసిందని, అతి తక్కువగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐదుగురు ప్లేయర్లను వదులుకుందని తెలిపింది.
డిసెంబర్ 9న డబ్ల్యూపీఎల్ 2024 మినీ వేలాన్ని ముగించి డిసెంబర్ 15-19 మధ్య ఐపీఎల్ వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జూన్లో టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ 2024 సీజన్ను మార్చి రెండో వారంలోనే ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది.