WPL 2024 Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ నేపథ్యంలో జరిగిన మినీ వేలంలో భారత అనామక ప్లేయర్ కాశీవ్ గౌతమ్ రికార్డ్ ధర పలికింది. రూ. 10 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కాశ్వీ గౌతమ్ను గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఈ అనామక ఆల్రౌండర్ కోసం గుజరాత్ జెయింట్స్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. రూ. 70 లక్షల వరకు ఆర్సీబీ బిడ్ వేయగా.. అక్కడి నుంచి యూపీ వారియర్స్ పోటి పడింది. రూ. 1.7 కోట్లతో బిడ్ మొదలుపెట్టగా.. గుజరాత్ జేయింట్స్ మరో 10 లక్షలు పెంచింది. ఆ తర్వాత రూ. 2 కోట్లు పాడిన గుజరాత్ జెయింట్స్ ఈ యువ ఆల్రౌండర్ను సొంతం చేసుకుంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాశీవ్ గౌతమ్ను అరంగేట్ర డబ్ల్యూపీఎల్లో ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. కనీస ధరకు కూడా కొనుగోలు చేయలేదు. దాంతో ఆమె గతేడాది అన్సోల్డ్ లిస్ట్లో చేరిపోయింది. తాజా వేలంలో భారీ ధర పలకడంతో కాశ్వీ గౌతమ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. Who is Kashvee Gautam అని గూగులమ్మను ఆశ్రయిస్తున్నారు.
రైట్ ఆర్మ్ పేసర్ అయిన కాశ్వీ గౌతమ్.. బ్యాట్తో బిగ్ షాట్స్ ఆడగలదు. దేశవాళీ క్రికెట్లో ఆమె ఛండీఘర్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. అండర్-19 దేశవాళీ క్రికెట్లో కాశ్వీ గౌతమ్ హ్యాట్రిక్తో తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అరుణాచల్ ప్రదేశ్, చంఢీగర్ మధ్య జరిగిన మ్యాచ్లో కాశ్వీ ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్లో ఆమె హ్యాట్రిక్తో పాటు మొత్తం పది వికెట్లు పడగొట్టింది. అంతేకాకుండా బ్యాట్తో 49 పరుగులు చేసింది.
సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 4.14 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టింది. ఈ ఏడాది జూన్లో హాంగ్ కాంగ్ వేదికగా జరిగిన అండర్ 23 ఎమర్జింగ్ టోర్నీలో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
చంఢీగర్అండర్ 23 టీమ్ సారథిగా కూడా కాశ్వీ గౌతమ్ ఎంపికైంది. ముంబై వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీలో ఆమె చంఢీగర్ జట్టును నడిపించనుంది. హ్యాట్రిక్తో ఆమె కనబర్చిన సంచలన ప్రదర్శనే ఆమెపై కాసుల వర్షం కురిపించింది.