WPL 2024 Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ నేపథ్యంలో జరిగిన మినీ వేలంలో భారత అనామక ప్లేయర్ కాశీవ్ గౌతమ్ పంట పండింది. రూ. 10 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కాశ్వీ గౌతమ్ను గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఈ అనామక ఆల్రౌండర్ కోసం గుజరాత్ జెయింట్స్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆర్సీబీతో పోటీపడిన యూపీ వారియర్స్ రూ. 1.7 కోట్లతో బిడ్ మొదలుపెట్టగా.. గుజరాత్ జేయింట్స్ మరో 10 లక్షలు పెంచింది. ఆ తర్వాత రూ. 2 కోట్లు పాడిన గుజరాత్ జెయింట్స్ ఈ యువ ఆల్రౌండర్ను సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు జరిగిన ఈ వేలంలో సదర్లాండ్, కాశ్వీ గౌతమ్ మాత్రమే రూ. 2 కోట్లు పలికారు. భారత ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా కాశ్వీ గౌతమ్ నిలిచింది.
మరో అనామక ప్లేయర్ వ్రిందా దినేష్ను యూపీ వారియర్స్ రూ. 1.3 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా ప్లేయర్ ఎక్తా బిష్త్ను ఆర్సీబీ రూ. 60 లక్షలకు సొంతం చేసుకుంది. ఇక అన్నేబెల్ సదర్లాండ్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐదు జట్లలో గరిష్టంగా 30 స్థానాలు ఖాళీగా ఉండగా.. మొత్తం 165 మంది అమ్మాయిలు వేలం రేసులో నిలిచారు. ఇందులో 104 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 61 మంది విదేశీయులు, అంతర్జాతీయ క్రికెటర్లు 56 మంది ఉన్నారు. ఐదు జట్లలో విదేశీ ఆటగాళ్ల స్థానాలు 9 ఉండగా.. ఒక్కో జట్టులో గరిష్టంగా 18 మంది మాత్రమే ఉండాలి.
పర్స్ మనీ విషయంలో రూ. 5.95 కోట్లతో గుజరాత్ జెయింట్స్ టాప్లో ఉండగా.. యూపీ వారియర్స్(రూ.4 కోట్లు), ఆర్సీబీ(రూ.3.35 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్(రూ.2.25 కోట్లు), ముంబై ఇండియన్స్(రూ.2.1 కోట్లు) ఉన్నాయి. ఈ వేలంలో కొంత మంది భారత అమ్మాయిలకు భారీ ధర పలికే అవకాశం ఉంది.