WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్కు సంబంధించిన మినీ వేలానికి రంగం సిద్దమైంది. ముంబై వేదికగా నేటి(శనివారం) మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మాయిల వేలం ప్రారంభం కానుంది. మహిళల క్రికెట్ అభివృద్ది కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గతేడాదే ఈ టోర్నీని ఆరంభించిన విషయం తెలిసిందే.
ఐదు జట్లతో ముంబై వేదికగా జరిగిన తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తలపడగా.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టైటిల్ సొంతం చేసుకుంది.ఇక గత సీజన్లో తమకు భారంగా మారిన ప్లేయర్లను ఈ ఐదు ఫ్రాంచైజీలు వదిలేసాయి. వాళ్లతో పాటు ఈ టోర్నీ ఆడేందుకు చూస్తున్న ఇతర ప్లేయర్లతో తాజా వేలం నిర్వహించనున్నారు.

ప్రతీ జట్టులో విదేశీ ప్లేయర్లు ఆరుకు మించకూడదు. ఈ వేలంలో గుజరాత్ జెయింట్స్ అత్యధికంగా 10 మంది ప్లేయర్లను కొనే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్సీబీ(7), యూపీ వారియర్స్(5), ముంబై ఇండియన్స్(5), ఢిల్లీ క్యాపిటల్స్(3) ఎక్కువ ఖాళీలు ఉన్నాయి.
గుజరాత్ చేతిలో ఎక్కువ డబ్బులు: పర్స్ మనీ విషయంలో రూ. 5.95 కోట్లతో గుజరాత్ జెయింట్స్ టాప్లో ఉండగా.. యూపీ వారియర్స్(రూ.4 కోట్లు), ఆర్సీబీ(రూ.3.35 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్(రూ.2.25 కోట్లు), ముంబై ఇండియన్స్(రూ.2.1 కోట్లు) ఉన్నాయి. ఈ వేలంలో కొంత మంది భారత అమ్మాయిలకు భారీ ధర పలికే అవకాశం ఉంది.
స్పెషల్ అట్రాక్షన్గా అండర్-19 స్థార్ : కనీస ధర రూ.10 లక్షలతో వేలానికి రానున్న మన్నత్ కశ్యప్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఈ ఏడాది భారత్ అండర్ 19 ప్రపంచకప్ గెలవడంలో ఈ ఢిల్లీ అమ్మాయి కీలక పాత్ర పోషించింది. 6 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టిన ఆమె ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు.
స్టార్ ఆల్రౌండర్గా ఎదిగిన దేవిక వైద్య కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది. అరంగేట్ర సీజన్లో రూ.1.4 కోట్లు పలికిన ఆమెను యూపీ సొంతం చేసుకుంది. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వేలంలోకి వదిలేసింది.

సీనియర్లు కూడా :
వేద కృష్ణమూర్తి, పూనమ్ రౌత్, సుష్మ వర్మ, ఏక్తా బిష్త్ వంటి భారత ఆటగాళ్లు కూడా భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. విదేశీ ఆటగాళ్లలో శ్రీలంకకు చెందిన చమరి ఆటపట్టు, వెస్టిండీస్ ఆల్రౌండర్ డాటిన్, ఆసీస్ ఆల్రౌండర్లు కిమ్ గార్డ్, అనాబెల్ సదర్లాండ్, ఇంగ్లండ్ బ్యాటర్ డేనియల్ వ్యాట్, ఆస్ట్రేలియా స్పిన్నర్ జేడ్ వెల్లింగ్టన్, సౌతాఫ్రికా పేసర్ షబ్నీమ్ కూడా భారీ ధర పలకవచ్చు.
ఏ ఛానెల్లో వస్తుందంటే...?
డబ్ల్యూపీఎల్ వేలం జియోసినిమా యాప్తో పాటు వెబ్సైట్లో ప్రత్యక్షప్రసారం కానుంది. స్పోర్ట్స్ 18 చానెల్లో కూడా చూడవచ్చు. డబ్ల్యూపీఎల్ మీడియా రైట్స్ను జియోసినిమా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.