
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీవారియర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. గుజరాత్ జెయింట్స్తో సోమవారం జరిగిన కీలక పోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలను గల్లంతు చేసిన యూపీ వారియర్స్.. మూడో జట్టుగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. అష్లే గార్డ్నర్(39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 60), దయాలన్ హేమలత(33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించారు. యూపీ వారియర్స్ బౌలర్లలో రాజేశ్వర్ గైక్వాడ్, పర్శావి చోప్రా రెండేసి వికెట్లు తీయగా.. తెలుగు అమ్మాయి అంజలి శర్వాణి, సోషీ ఎక్లీస్టోన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకుంది. తహిళా మెక్గ్రాత్(38 బంతుల్లో 11 ఫోర్లతో 57), గ్రేస్ హరీస్(41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో కిమ్ గార్త్ రెండు వికెట్లు తీయగా.. మోనికా పటేల్, అష్లే గార్డ్నర్, తనుజా కన్వార్, స్నేహ్ రాణా తలో వికెట్ తీసారు.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన గ్రేస్ హరీస్తో కలిసి తహిలా మెక్గ్రాత్ జట్టును ఆదుకుంది. నాలుగో వికెట్కు 78 పరుగులు జోడించిన అనంతరం మెక్గ్రాత్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(6) కూడా తీవ్రంగా నిరాశపరిచింది.
చివర్లో సోఫీ ఎక్లీస్టోన్ ధాటిగా ఆడి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. చివరి ఓవర్లో యూపీ వారియర్స్ విజయానికి 7 పరుగులు అవసరమవ్వగా.. సిమ్రాన్ షేక్ రనౌటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠతకు దారి తీసింది. చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన స్థితిలో సోఫీ ఎక్లీస్టోన్ బౌండరీ బాది విజయాన్నందించడంతో పాటు జట్టును ప్లే ఆఫ్స్ చేర్చింది.