
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సంచలన విజయం నమోదు చేసింది. వరుసగా ఐదు ఓటములతో డబ్ల్యూపీఎల్ను పేలవంగా ఆరంభించిన ఆర్సీబీ.. కొంచెం ఆలస్యంగా పుంజుకుంది. గత మ్యాచ్లో తొలి విజయాన్నందుకొని బోణీ కొట్టిన బెంగళూరు.. అదే జోరులో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గుజరాత్ జెయింట్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సోఫీ డివైన్(36 బంతులు.. 9 ఫోర్లు.. 8 సిక్సర్లు.. 99) విధ్వంసకర బ్యాటింగ్తో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్ ( 42 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్స్లతో 68), ఆష్లీ గార్డ్నర్ ( 26 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్తో 41) రాణించారు. అనంతర ఆర్సీబీ సోఫీ డివైన్ సంచలన ఇన్నింగ్స్తో 15.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన ( 31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 37) కూడా లీగ్లో తొలిసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడింది. టోర్నీలో రెండో విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఆష్లీ గార్డ్నర్కు వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే డివైన్ చెలరేగింది. వరుసగా 6, 4, 4, 6, 4తో ఏకంగా 24 పరుగులు పిండుకుంది. తనూజ కన్వర్ వేసిన తొమ్మిదో ఓవర్లోనూ డివైన్ ఇలాగే వరుసగా 6, 4, 6, 6 బాదేసి 25 పరుగులు రాబట్టింది. సోఫీ ధాటికి అంతకంటే ముందు తనూజ ఒక ఓవర్లో 18 పరుగులు సమర్పించుకుంది. పిచ్ బ్యాటింగ్కు పూర్తి అనుకూలంగా ఉండటం, చిన్న బౌండరీలులో ఉండటంతో సోఫీ ఆకాశమే హద్దుగా చెలరేగింది.

మరోవైపు ఫామ్ అందుకున్న స్మృతి కూడా ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికే 77 పరుగులు చేసిన ఆర్సీబీ.. 8 ఓవర్లకే 100 చేరుకుంది. స్మృతిని స్నేహ్ రాణా రిటర్న్ క్యాచ్తో ఔట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 11వ ఓవర్లోనే సెంచరీకి చేరువైన డివైన్.. గార్త్ వేసిన 12వ ఓవర్లో 97 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్ను గుజరాత్ నేల పాలు చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని సోఫీ.. తర్వాతి బంతికే తొందరపాటుతో మరో షాట్ ఆడబోయి అశ్విని చేతికి చిక్కింది. దీంతో ఒక్క పరుగు తేడాలో ఆమె సంచలన సెంచరీని కోల్పోయింది. తర్వాత ఎలీస్ పెర్రీ (19 నాటౌట్)తో కలిసి హీదర్ నైట్ (22 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.