
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హ్యాట్రిక్ పరాజయాలను అందుకుంది. గుజరాత్ జెయింట్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లోనూ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బౌలింగ్లో చేసిన ఓ తప్పిదమే తమ ఓటమిని శాసించిందని ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మంధాన.. తమ బౌలర్లు అదనంగా 10-15 పరుగులిచ్చారని పేర్కొంది. మైదానంలో ఓ వైపు బౌండరీ చాలా చిన్నగా ఉందని, దానికి తగ్గట్లు తమ బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారని చెప్పింది. ఈ తప్పిదమే తమ ఓటమికి కారణమైందని చెప్పుకొచ్చింది.
'బౌలింగ్లో మేం అదనంగా 10-15 పరుగులిచ్చాం. అయితే బ్యాటింగ్లో మా అమ్మాయిలు అదరగొట్టారు. విజయం కోసం ఆఖరి వరకు పోరాడారు. మైదానంలోని ఔట్ ఫీల్డ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. అలాగే ఓ వైపు బౌండరీ చిన్నగా ఉంది. మా బౌలర్లు చిన్న బౌండరీకి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయారు. బ్యాటర్లు అటు వైపు ఆడకుండా బౌలింగ్ చేయాల్సింది. శ్రేయాంక బౌలింగ్, బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. కనిక బ్యాటింగ్ అప్రోచ్ కూడా ఆకట్టుకుంది. మా దేశవాళీ ఆటగాళ్లలో ఈ ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు.'అని మంధాన పేర్కొంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్(45 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 67),సోఫియా డంక్లీ(28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హీథర్ నైట్ రెండేసి వికెట్లు తీయగా.. మేఘన స్కట్, రేణుకా సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులే చేసి ఓటమిపాలైంది. సోఫీ డివైన్(45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఎల్లిస్ పెర్రీ(32), హీథర్ నైట్(11 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 30 నాటౌట్) పర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో అష్లే గార్డనర్ మూడు వికెట్లు తీయగా.. సదర్లాండ్ రెండు వికెట్లు పడగొట్టింది. మంధాన(18) తీవ్రంగా నిరాశపరిచింది.