
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న లీగ్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. భారీ స్కోర్ చేయడం కంటే బేసిక్స్పై ఫోకస్ పెట్టి ఆడాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. తమ టాప్-4 బ్యాటర్లు చెలరేగితే 170+ టార్గెట్ నమోదవుతుందని పేర్కొంది.
చేజింగ్ చేయడం ఒత్తిడిగా ఉంటుందని చెప్పింది. తమ బలాలకు అనుగుణంగా ఆడి.. భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచాలనుకుంటున్నామని తెలిపింది. ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నామని చెప్పిన స్మృతి.. ఆషా శోభనకు బదులుగా శ్రేయంక పాటిల్ జట్టులోకి వచ్చిందని చెప్పింది.
ఇక టాస్ గెలిచినా తాము ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. తన కంటే స్మృతికే ఎక్కువ లక్ ఉన్నట్లుందని చమత్కరించింది. తమ బౌలింగ్ విభాగం ఆత్మవిశ్వాసంతో ఉందని, ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని పేర్కొంది.
గుజరాత్ జెయింట్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 140+ పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ అదే జోరు కొనసాగించాలనుకుంటుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తయిన ఆర్సీబీ బోణీ కోసం పరితపిస్తోంది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా(కీపర్), హీలీ మాథ్యూస్, నాటీ సివర్ బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), అమెలియా కేర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమన్ జోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమని కలితా, సైకా ఇషాక్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, దిషా కసత్, రిచా ఘోష్(కీపర్), హీథర్ నైట్, కనికా అహుజా, మేఘన స్కట్, శ్రేయంకా పాటిల్, ప్రీతీ బోస్, రేణుక ఠాకూర్ సింగ్