
ముంబై: దేశవ్యాప్తంగా ప్రజలందరూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మహిళల టీమ్ సైతం హోళీ ఆడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)తో డబ్ల్యూపీఎల్లో భాగమైన విదేశీ ఆటగాళ్లు కూడా హోలీ పండుగ జరుపుకొని సంబరాలు చేసుకున్నారు. తొలి రెండు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడినా.. ఆ బాధను హోలీతో మరిచిపోయే ప్రయత్నం చేసింది. టీమ్ డైరెక్టర్ మైక్ హెస్సెన్తో పాటు జట్టులో ప్రతీ ఒక్కరు రంగులు పూసుకున్నారు.
హోలీ రంగుల్లో దిగిన ఫొటోలను ఆర్సీబీ ఫ్రాంచైజీతో పాటు ఆటగాళ్లు అభిమానులతో పంచుకున్నారు. స్టార్ ప్లేయర్లు ఎలీసా పెర్రీ, హేథర్ నైట్ సోషల్ మీడియాలో వేదికగా ఫొటోలను షేర్ చేసి భారత ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. టీమ్ బాండింగ్ పెంచేందుకు ఈ పండుగను ఆర్సీబీ చక్కగా వాడుకుంది. అందాలకే కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్సీబీ మహిళల జట్టు.. రంగుల పండుగ జరుపుకోవడాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. భారత సంప్రదాయాలను, పండుగలను ఆర్సీబీ ఫ్రాంచైజీ గౌరవించడం గొప్ప విషయమని కామెంట్ చేస్తున్నారు. ఈ సంబరాలతోనైనా.. జట్టు గాడిన పడాలని కోరుకుంటున్నారు.
సోమవారం ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పేలవ బ్యాటింగ్తో 18.4 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్(3/28) మూడు వికెట్లు తీయగా.. సైకా ఇషాక్(2/26), అమెలియా కేర్(2/30) రెండేసి వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్ ఓ వికెట్ పడగొట్టింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. హేలీ మాథ్యూస్(38 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 77 నాటౌట్), నాట్ సివర్ బ్రంట్(29 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో ప్రీతి బోస్ ఒక్కరే ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలైంది. బుధవారం గుజరాత్ జెయింట్స్తో ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.