
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ ప్లేయర్ల వైఫల్యం కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. ముంబై సూపర్ బౌలింగ్కు 20 ఓవర్లు ఆడలేకపోయారు. లోయరార్డర్ బ్యాటర్లు రాణించడంతో 18.4 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది.
రిచా ఘోష్(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28), కనిక అహుజా(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22), శ్రేయంక పాటిల్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), మేఘన్ స్కట్(14 బంతుల్లో 3 ఫోర్లతో 20) విలువైన పరుగులు చేయడంతో ఆర్సీబీ ముంబై ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు స్మృతి మంధాన(17 బంతుల్లో 5 ఫోర్లతో 23), సోఫీ డివైన్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16) శుభారంభం అందించినా.. దిషా కసత్(0), ఎల్లిస్ పెర్రీ(13), హీథర్ నైట్(0) వరుసగా ఔటవ్వడం ఆర్సీబీ కొంపముంచింది.
ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్(3/28) మూడు వికెట్లు తీయగా.. సైకా ఇషాక్(2/26), అమెలియా కేర్(2/30) రెండేసి వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్ ఓ వికెట్ పడగొట్టింది. మైదానంలో గాలి వీస్తుండటంతో స్పిన్ బౌలింగ్ను ఆర్సీబీ బ్యాటర్లు ఆడలేకపోయారు. తొలి వికెట్కు స్మృతి మంధాన, సోఫీ డివైన్ 39 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినా.. నాలుగు పరుగుల వ్యవధిలోనే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఎల్లిస్ పెర్రీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. రిచా ఘోష్తో సమన్వయ లోపంతో రనౌటైంది.
క్రీజులోకి వచ్చిన కనిక అహుజాతో 34 పరుగులు జోడించిన రిచా ఘోష్.. ధాటిగా ఆడే క్రమంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. మేఘన స్కట్తో కలిసి శ్రేయంక పాటిల్ 8వ వికెట్కు 34 పరుగులు జోడించడంతో ఆర్సీబీ 150 పరుగుల మార్క్ అందుకుంది.