
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) భాగమైన విషయం తెలిసిందే. బెంగళూరు బేస్ ఫ్రాంచైజీని ఆర్సీబీకి చెందిన రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.901 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు సంబంధించిన ప్లేయర్స్ ఆక్షన్ ఫిబ్రవరి రెండో వారంలో జరగనుండగా.. ఆర్సీబీ సత్తా కలిగిన ప్లేయర్ల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమ్మాయిలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
ముఖ్యంగా మహిళా పేస్ బౌలర్లకు సువర్ణవకాశం కల్పించింది. ఎవరైతే గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తారో వారు తమ వివరాలను తమకు పంపించాలని పేర్కొంది. బౌలింగ్కు సంబంధించిన వీడియోలను [email protected] మెయిల్ చేయాలని కోరింది. ఈ మేరకు ఆర్సీబీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ వివరాలను మాజీ భారత మహిళా క్రికెటర్ వనితా వీఆర్ ట్వీట్ చేసింది.
ఐదు జట్ల మధ్య జరగనున్న డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్లో మొత్తం 22 మ్యాచ్లు జరగనున్నాయి. మ్యాచ్లన్నీ ముంబైలోని బార్బోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. లీగ్ మార్చి తొలి వారంలో ప్రారంభమై చివరి వారంలో ముగిసే అవకాశం ఉంది. ఈ లీగ్ భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. డబ్ల్యూపీఎల్ ద్వారా బీసీసీఐకి రూ.5వేల కోట్లకు ప్లస్ ఆదాయం చేకూరింది.
ఐదు జట్ల విక్రయాల ద్వారా రూ.4,669.99 కోట్లు రాగా.. వచ్చే ఐదేళ్ల మీడియా రైట్స్ను రిలయన్స్కు చెందిన వయాకామ్ సంస్థ రూ.951 కోట్లకు కొనుగోలు చేసింది.
అహ్మదాబాద్, మంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో బేస్ ఫ్రాంచైజీల కోసం మొత్తం 30 కంపెనీలు పోటీపడగా.. అత్యధిక ధరను బిడ్ వేసిన ఆదాని గ్రూప్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, కాప్రి గ్లోబల్ సంస్థలు మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలను దక్కించుకున్న విషయం తెలిసిందే.