
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ముంబై 55 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది. దాంతో వరుసగా ఐదు విజయాలను ఖాతాలో వేసుకున్న ముంబై.. తొలి జట్టుగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. మరోవైపు ఐదు మ్యాచ్ల్లో నాలుగు ఓటములతో గుజరాత్ జెయింట్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్( 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. యాస్తిక భాటియా ( 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 44), నాట్ సీవర్ (31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36) సత్తా చాటారు. గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డ్నర్ (3/34) ఆకట్టుకుంది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ముంబై బౌలర్లలో నాట్ సీవర్ (3/21), హేలీ మాథ్యూస్ (3/23), అమేలియా కెర్ (2/18)లు సత్తా చాటారు.
తొలి ఓవర్లోనే సోఫియా డంక్లీ (0)ను పేసర్ నాట్ సీవర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో మొదలైన గుజరాత్ పతనం ఏ దశలోనూ ఆగలేదు. స్పిన్నర్లు హేలీ, అమేలియాల రాకతో వరుసగా వికెట్లు కోల్పోయింది. సబ్బినేని మేఘన (16), హర్లీన్ డియోల్ (22), స్నేహ్ రాణా (20) కాసేపు నిలబడ్డా ముంబై బౌలర్లు కుదురుకోనివ్వలేదు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై.. తొలి ఓవర్లోనే హేలీ మాథ్యూస్ (0) వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత ఇన్నింగ్స్ సాఫీగానే సాగిపోయింది. ఓపెనర్ యాస్తిక భాటియాతో జత కలిసిన నాట్ సీవర్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. యాస్తిక కూడా చూడముచ్చటైన బౌండరీలు బాదింది.
11వ ఓవర్లో సీవర్ ఔటయ్యే సమయానికి స్కోరు 75 కాగా... హర్మన్ప్రీత్తో సమన్వయ లోపంతో యాస్తిక కూడా రనౌటైంది. 84/3తో ముంబై ఇబ్బందుల్లో పడ్డట్లు కనిపించినా.. హర్మన్ప్రీత్ చెలరేగిపోవడంతో ఆ జట్టు పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. ఆష్లీ గార్డ్నర్ ధాటికి ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా.. హర్మన్ భారీ షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. ఆమె 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసింది.