
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2023లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో యూపీ వారియర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని యూపీ వారియర్స్ కెప్టెన్, బర్త్ డే గర్ల్ అలీస్సా హీలీ(Alyssa Healy) పేర్కొంది. 'వరుసగా టాస్ గెలవడం అద్భుతం. ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో పాటు డ్యూ వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా గత కొన్ని మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఓడిపోయాయి. తుది జట్టులో కొన్ని మార్పులు చేశాం. గ్రేస్ హరీస్ జట్టులోకి రాగా.. షబ్నిమ్ దూరమైంది'అని అలీసా హీలీ చెప్పుకొచ్చింది. అలీస్సా హీలీ నేడు 33వ జన్మదినం జరుపుకుంటుంది.
టాస్ గెలిస్తే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేదానినని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) తెలిపింది. అయితే ఈ మైదానంలో ఆడిన గత మ్యాచ్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించిందని గుర్తు చేసింది. చేజింగ్ చేయడం తమ తొలి ప్రాధాన్యమైనా.. ఈ సవాల్ను స్వీకరిస్తున్నామని పేర్కొంది.
తమ జట్టు చాలా పటిష్టంగా ఉందని, సానుకూల దృక్పథంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నామని చెప్పింది. ఓ రెండు మ్యాచ్లు తమ అగ్రస్థానాన్ని గల్లంతు చేశాయని, అయినా తాము సానుకూలంగా ఉన్నామని, ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పింది.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: హీలీ మాథ్యూస్, యస్తికా భాటియా(కీపర్), నాట్ సీవర్, హర్మన్ప్రీత్ కౌర్, మేలీ కేర్, పూజ వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమన్జోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమని కలితా, సైకా ఇషాక్
యూపీ వారియర్స్: అలీస్సా హీలీ(కీపర్), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహిళా మెక్గ్రాత్, గ్రేస్ హరీస్, కిరన్ నవిగిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లీ స్టోన్, అంజలి శర్వాణి, పర్శావి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్