
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఫస్ట్ సీజన్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ఏ మాత్రం కలిసిరాలేదు. వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిన ఆ జట్టు.. ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో గెలిచి పరువు దక్కించుకుంది. కానీ ఆఖరి మ్యాచ్లో మళ్లీ ఓడి అభిమానులను నిరాశపరిచింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు అడుగు దూరంలో నిలిచింది. యూపీ వారియర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైతే.. ముంబై నేరుగా ఫైనల్కు అర్హత సాధించనుంది. గెలిస్తే మాత్రం యూపీ వారియర్స్తో ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. స్మృతి మంధాన(24), ఎల్లిస్ పెర్రీ(29), రిచా ఘోష్(29) టాప్ స్కోరర్లుగా నిలిచింది. ముంబై బౌలర్లలో అమెలియా కేర్ మూడు వికెట్లు తీయగా.. నాట్ సివర్ బ్రంట్, ఇస్సీ వాంగ్ రెండేసి వికెట్లు పడగొట్టింది. సైకా ఇషాక్ ఓ వికెట్ తీసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసి విజయాన్నందుకుంది. హీలీ మాథ్యూస్(17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 24), యస్తికా భాటియా(26 బంతుల్లో 6 ఫోర్లతో 30), అమెలియా కేర్(31 నాటౌట్) రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో మేఘన స్కట్, శ్రేయాంక పాటిల్, సోభాన ఆశా తలో వికెట్ తీయగా.. కనికా అహుజా రెండు వికెట్లు పడగొట్టాడు.