
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఢిల్లీ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. యూపీ వారియర్స్తో జరుగుతున్న మ్యాచ్లో కెప్టెన్ మెగ్ లాన్నింగ్(42 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 70), జెస్ జొనాస్సెన్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్), అలిస్ కాప్సీ(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 21) మెరుపులు మెరిపించారు.
యూపీ వారియర్స్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తహిళా మెక్గ్రాత్, సోఫీ ఎకిల్స్టోన్ తలో వికెట్ తీసారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్ లాన్నింగ్ మంచి శుభారంభం అందించారు. ఇద్దరూ జోరుగా ఆడటంతో పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. అయితే తహిళా మెక్గ్రాత్ షెఫాలీ వర్మ(17) ఔట్ చేయడంతో తొలి వికెట్కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

మరిజన్నే కాప్(16) విఫలమైనా.. మెగ్ లాన్నింగ్ సూపర్ బ్యాటింగ్తో లీగ్లో రెండో హాఫ్ సెంచరీ నమోదు చేసింది. సెంచరీ దిశగా దూసుకెళ్లిన ఆమెను గైక్వాడ్ క్లీన్ బౌల్డ్ చేసింది. తర్వాత వచ్చిన అలిస్ క్యాప్సీ మెరుపులు మెరిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయింది. చివర్లో జెస్ జోనాస్సెన్, జెమీమా చెలరేగడంతో ఢిల్లీ సునాయసంగా 200 పరుగుల మార్క్ అందుకుంది. ఢిల్లీ బౌలర్లు విఫలమైనా.. అద్భుతమైన ఫీల్డింగ్తో చాలా పరుగులను సేవ్ చేశారు.