
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2023 సీజన్లో ముంబై ఇండియన్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం యూపీ వారియర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 72 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. నాట్ సీవర్(38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 72 నాటౌట్) సూపర్ బ్యాటింగ్కు ఇస్సీ వాంగ్(4/15) హ్యాట్రిక్ వికెట్ తోడవ్వడంతో ముంబై ఇండియన్స్కు ఎదురేలేకుండా పోయింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో యూపీ వారియర్స్ తేలిపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. సీవర్కు తోడుగా హీలీ మాథ్యూస్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 26), అమెలియా కేర్(19 బంతుల్లో 5 ఫోర్లతో 29) రాణించారు. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్లీస్టోన్ రెండు వికెట్లు తీయగా.. తెలుగు అమ్మాయి అంజలి శర్వాణీ, పర్శవి చోప్రా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్ 17.4 ఓవర్లలో 110 పరుగులకు కుప్పకూలింది. కిరన్ నవగిరే(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 43) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. ముంబై బౌలర్లలో ఇస్సీ వాంగ్ నాలుగు వికెట్లు తీయగా.. సైకాఇషాక్ రెండు వికెట్లు పడగొట్టింది. నాట్ సీవర్, హీలీ మాథ్యూస్, జింటిమని కలితా తలో వికెట్ తీసారు. లక్ష్యచేధనలో యూపీ ఆరంభం నుంచే తడబడింది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు శ్వేతా సెహ్రావత్(1), అలీస్సా హీలీ(11) పెవిలియన్ చేరారు. తహీళా మెక్గ్రాత్(7) కూడా రనౌటవ్వడంతో పవర్ ప్లేలో యూపీ 3 వికెట్లకు 46 పరుగులు మాత్రమే చేసింది. గ్రేస్ హరీస్, కిరణ్ నవిగిరే పోరాడినా ఫలితం లేకపోయింది. 13వ ఓవర్లో ఇస్సీ వాంగ్ కిరణ్ నవిగిరే, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లే స్టోన్లను వరుసగా ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించడంతో యూపీ పతనం ఖాయమైంది. డబ్ల్యూపీఎల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్గా ఇస్సీ వాంగ్ చరిత్రకెక్కింది. ముంబై ఆల్రౌండ్షోతో యూపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.