
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్పై గ్రాస్ ఉండటంతో పాటు చేజింగ్కు మంచి రికార్డు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ తెలిపింది.
డబ్ల్యూపీఎల్లో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పిన బెత్ మూనీ.. ఫ్రాంచైజీ లీగ్స్ ఆడిన అనుభవం తమ జట్టులో కొంత మందికి ఉందని తెలిపింది. అనుభవం లేని ఆటగాళ్లకు అనుభవం కలిగిన ప్లేయర్లు సలహాలు ఇచ్చారని చెప్పింది. ముగ్గురు పేసర్లు, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని బెత్ మూనీ చెప్పుకొచ్చింది.
ఇక తన జీవితంలో ఇదో ప్రత్యేకమైన రోజని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలతో గూజ్బంప్స్ వచ్చాయని తెలిపింది. ఈ పిచ్ బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పిన హర్మన్ ప్రీత్.. బౌలర్లకు కూడా కాస్త హెల్ప్ ఉంటుందని పేర్కొంది. ఈ మ్యాచ్ను ఆస్వాదిస్తూ తమ సత్తా చాటాల్సిన అవసరం ఉందని తెలిపింది. అస్సామ్కు చెందిన జిటిమని కైతా ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతుందని చెప్పుకొచ్చింది.
అంతకు ముందు డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కియారా అద్వాణీ, కృతి సనన్ తమ ఆటతో అభిమానులను ఉర్రతలూగించగా.. ప్రముఖ రాప్ సింగర్ ఏపి దిల్లాన్ తన పాటతో సందడి చేశాడు. ముందుగా కియారా అద్వాణీ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్కు చిందేసి అభిమానులను ఫిదా చేయగా.. అనంతరం కృతిసనన్తో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ప్రదర్శించారు.
బిజిలీ పాటతో కియారా అద్వాణీ తన డ్యాన్స్ను ముగించగా.. చక్దే ఇండియా అంటూ జెండా ఊపుతూ కృతి సనన్ స్టేజ్పైకి వచ్చింది. పరమ్ సుందరీ సాంగ్తో ఆమె డ్యాన్స్ ముగియగా.. దిల్లాన్ తన స్టైల్లో స్లేజీపైకి వచ్చాడు. అనంతరం బీసీసీఐ పెద్దల సమక్షంలో ఐదుగురు కెప్టెన్లు డబ్ల్యూపీఎల్ టైటిల్ను ఆవిష్కరించారు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్(మహిళలు): హీలీ మాథ్యూస్, యస్తికా భాటియా(కీపర్), హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సివర్ బ్రంట్, అమెలియా కేర్, అమనోత్ కౌర్, పూజా వస్త్రాకర్, హుమైరా ఖాజీ, ఇస్సీ వాంగ్, జింటిమని కలితా, సైకా ఇషేక్
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ(కీపర్, కెప్టెన్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, అష్లే గార్డనర్, సధర్లాండ్, హేమలత, జార్జియా వారెహమ్, స్నేహ్ రాణా, తనూజ కన్వార్, మోనికా పటేల్, మాన్సి జోషి