
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ స్మృతి మంధాన వైఫల్యం కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ మంధాన దారుణంగా విఫలమైంది. 15 బంతులాడి 8 పరుగులు మాత్రమే చేసింది. కష్టాల్లో ఉన్న జట్టును ఎల్లిస్ పెర్రీ(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67 నాటౌట్) హాఫ్ సెంచరీతో ఆదుకుంది. రిచా ఘోష్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37)తో కలిసి పెర్రీ నాలుగో వికెట్కు 74 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే కెప్టెన్ స్మృతి మంధాన(8) క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. క్రీజులో సెట్ అయ్యేందుకు ఆచితూచి ఆడిన మంధాన చివరకు శిఖా పాండే బౌలింగ్లో వెనుదిరిగింది. క్రీజులోకి వచ్చిన ఎల్లిస్ పెర్రీ కూడా నిలదొక్కకునేందుకు టైమ్ తీసుకోవడంతో ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో సెట్ అయిన సోఫీ డివైన్(21)ను శిఖా పాండే క్లీన్ బౌల్డ్ చేయగా.. హీథర్ నైట్(11)ను తారా నోరీస్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్తో ఎల్లిస్ పెర్రీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది.

15వ ఓవర్లో పెర్రీ ఇచ్చిన క్యాచ్ను ఢిల్లీ నేలపాలు చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పెర్రీ ధాటిగా ఆడింది. మరోవైపు రిచా ఘోష్ సైతం ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. తారా నోర్రీస్ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్స్లు బాది పెర్రీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19వ ఓవర్లో రిచా ఘోష్ క్యాచ్ ఔటవ్వడంతో నాలుగో వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో పెర్రీ సిక్సర్ బాదడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోర్ చేసింది.