
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్లూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ప్రాతినిథ్య వహిస్తున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రీపై భారత అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అందం, ఆటతోనే కాకుండా మైదానంలో తన చర్యలతో పెర్రీస్ ఆకట్టుకుంటుందని కొనియాడుతున్నారు. స్టార్ ప్లేయర్ అయిన ఎల్లిస్ పెర్రీ మ్యాచ్ పూర్తయిన వెంటనే తన డగౌట్ పరిసరాలను శుభ్రం చేస్తుంది. డగౌట్లో సహచర ఆటగాళ్లు ఉపయోగించిన వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఇతర తినుబండారాలు, వారు పడేసిన చెత్తను మ్యాచ్ ముగిసిన వెంటనే గార్బెజ్ కవర్ పట్టుకొని సేకరిస్తూ శుభ్రం చేస్తుంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో ఎల్లిస్ పెర్రీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పెర్రీ ఇలా డగౌట్ క్లీన్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమె ఇలా మ్యాచ్ ముగిసిన తర్వాత చెత్తను ఏరింది. ఇదే విషయాన్ని ఆమెను ప్రశ్నించగా.. 'నా అభిప్రాయం ప్రకారం మనం ఆడిన చోటును మనం గౌరవించాలి..'అని బదులిచ్చింది. ఆట తప్ప తమ చుట్టు పక్కల పరిస్థితులను పట్టించుకోని క్రికెటర్లు ఉన్న ఈ రోజుల్లో పెర్రీ ఇలా క్లీన్ చేయడం ఎంతోమందికి స్పూర్తిదాయకమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
డబ్లూపీఎల్ 2023లో ఎల్లిస్ పెర్రీ అద్భుతంగా రాణిస్తున్నా.. ఆర్సీబీ ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఆర్సీబీ ఎల్లిస్ పెర్రీ మినహా అంతా విఫలమవుతున్నారు. పెర్రీ ఒక్కతే రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. నేడు యూపీ వారియర్స్తో జరిగే మ్యాచ్లో కూడా ఓడితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే మాత్రం వరుసగా చివరి మూడు మ్యాచ్లు గెలవడంతో పాటు పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో నిలవాలి. అది జరగాలంటే మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న గుజరాత్ జెయింట్స్, యూపీవారియర్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో చిత్తుగా ఓడాలి. అప్పుడే ఆర్సీబీ అవకాశం ఉంటుంది.