
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఫైనల్కు ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకెళ్లింది. యూపీ వారియర్స్తో మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఢిల్లీ క్యాపిటల్స్.. పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. తాజా విజయంతో మెరుగైన రన్ రేట్ ఉన్న ఢిల్లీ.. ముంబై ఇండియన్స్ను వెనక్కునెట్టింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు మాత్రమే చేసింది. తహిళా మెక్గ్రాత్(32 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 58 నాటౌట్) ఒక్కతే హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ అలీస్సా హీలీ(36) పర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జెస్స్ జోనాసెన్ ఓ వికెట్ తీయగా.. అలిస్ కాప్సీ మూడు వికెట్లు, రాధా యాదవ్ రెండు వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్(39)తో పాటు మరిజన్నే కాప్(34 నాటౌట్), అలిస్ కాప్సీ(34) రాణించారు. యూపీ వారియర్స్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ రెండు వికెట్లు తీయగా.. సొప్పదండి యశశ్రీ, సోఫీ ఎక్లీస్టోన్ తలో వికెట్ తీసారు.
ఈ విజయంతో ఢిల్లీ నేరుగా ఫైనల్ చేరగా.. ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఢిల్లీతో ఫైనల్లో తలపడనుంది.