
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో కీలక అంకానికి రంగం సిద్దమైంది. తొలిసారి నిర్వహించనున్న డబ్ల్యూపీఎల్ వేలం సోమవారం ముంబై వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం ప్రారంభం కానుండగా.. ప్రసార హక్కులను దక్కించుకున్న స్పోర్ట్స్ 18, జియో సినిమా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, యువ సంచలనం షెఫాలీ వర్మలపై అందరి దృష్టి నెలకొంది. వీళ్లకు కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుందని భావిస్తున్నారు. అలీసా హేలీ, బేత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ షట్ (ఆస్ట్రేలియా).. నాట్ సీవర్ (ఇంగ్లండ్), డాటిన్ (వెస్టిండీస్) వంటి విదేశీ స్టార్లకు కూడా భారీ ధర పలుకుతుందని అంచనా.
మొత్తం 409 మంది క్రీడాకారిణులు వేలం జాబితాలో ఉన్నారు. ఐదు జట్లు.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ 90 మందిని ఎంపిక చేసుకోనున్నాయి. మొదటి ఏడాది ఒక్కో ఫ్రాంచైజీ రూ. 12 కోట్లు వెచ్చించేందుకు బీసీసీఐ అనుమతించింది. ఒక్కో జట్టులో 18 మంది క్రికెటర్లు ఉంటారు. కనీసం 15 మందిని తీసుకోవాలి. వీరిలో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉండాలి. 60 మంది భారత క్రికెటర్లు వేలం బరిలో నిలవగా.. వీరిలో కనీసం 20 నుంచి 25 మందికి మంచి రేటు లభించే చాన్సుంది. కనిష్ట బేస్ ధర రూ. 10 లక్షలుకాగా.. గరిష్ఠ రేటు రూ.50 లక్షలుగా నిర్ణయించారు. టీమిండియా క్రికెటర్లందరితోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా క్రీడాకారిణులకు చక్కటి ధర లభించే అవకాశాలున్నాయి.
స్మృతి, షెఫాలీ, హర్మన్ప్రీత్, ఆల్రౌండర్ దీప్తి శర్మలకు రూ.1.25 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ధర రావొచ్చని భావిస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్, సీమర్ రేణుక ఠాకుర్ కూడా ఆసక్తి రేపుతున్నారు. రాజేశ్వర్ గైక్వాడ్, రిచా యాదవ్, సీమర్లు మేఘన సింగ్, శిఖ పాండేల కోసం కూడా జట్లు గట్టిగా పోటీ పడే అవకాశముంది. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యులు శ్వేత సెహ్రావత్, పర్శవి చోప్రా, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, తితాస్ సాధు కూడా ఫ్రాంఛైజీలను ఆకర్షించవచ్చు. 246 మంది భారత క్రికెటర్లు, 163 మంది విదేశీ క్రికెటర్లు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్లోని హైదరాబాదీ గొంగడి త్రిష, శ్వేత, పార్శవి, టిటాస్ సాధు పైనా ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ఐదు ఫ్రాంచైజీలకు ఐదుగురు కెప్టెన్లు అవసరమైన నేపథ్యంలో స్మృతి, హర్మన్తో పాటు మెగ్ లానింగ్, హీథర్ నైట్, సోఫీ డివైన్కు డిమాండ్ ఉంది.