
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్కు సంబంధించిన వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లు లక్షలు పలికారు. ముంబై వేదికగా సోమవారం జరిగిన వేలంలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లనూ ఆయా ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఏపీ పేసర్ అంజలి శర్వాణిని రూ.55 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆమెపై యూపీ ఆసక్తి చూపించింది.
ఇటీవల అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యులైన హైదరాబాద్ పేసర్ యషశ్రీ, విశాఖపట్నం పేసర్ షబ్నమ్ను కనీస ధర రూ.10 లక్షలకు వరుసగా యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకున్నాయి. జాతీయ జట్టుకు ఆడిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డిని కనీస ధర రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఆంధ్ర బ్యాటర్ సబ్బినేని మేఘనను కనీస ధర రూ.30 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుక్కుంది. కానీ అండర్-19 ప్రపంచకప్లో మంచి ప్రదర్శన చేసిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష (కనీస ధర రూ.10 లక్షలు)ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
ఈ మెగా వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అత్యధిక ధర పలికింది. రూ.3.4 కోట్ల భారీ ధరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆల్రౌండర్లపైనా ఫ్రాంఛైజీలు రూ.కోట్లు కుమ్మరించాయి. మొత్తానికి అంచనాలకు మించి సాగిన ఈ వేలం.. అమ్మాయిలపై కాసుల వర్షాన్ని కురిపించింది.
ప్రతి జట్టు రూ.12 కోట్లతో వేలంలో అడుగుపెట్టాయి. మొత్తం 409 మంది వేలం బరిలో దిగగా... 87 మందిని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. అందులో 30 మంది విదేశీ క్రికెటర్లు. ఒక్కో జట్టు 6 మంది విదేశీ క్రికెటర్ల చొప్పున తీసుకుంది. మొత్తం రూ.59.5 కోట్లను ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టాయి. ఆర్సీబీ, దిల్లీ, గుజరాత్ 18 మంది క్రికెటర్ల చొప్పున కొనుగోలు చేయగా.. ముంబయి 17 మందిని, యూపీ వారియర్స్ 16 మందిని సొంతం చేసుకున్నాయి. ముంబయి, యూపీ మొత్తం డబ్బు ఖర్చు చేయగా.. దిల్లీ దగ్గర రూ.35 లక్షలు, ఆర్సీబీ దగ్గర రూ.10 లక్షలు, గుజరాత్ దగ్గర రూ.5 లక్షలు మిగిలాయి.