
ముంబై: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహిళల టీ20 ప్రీమియర్ లీగ్ 2020 ఘనంగా ప్రారంభమైంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కియారా అద్వాణీ, కృతి సనన్ తమ ఆటతో అభిమానులను ఉర్రతలూగించగా.. ప్రముఖ రాప్ సింగర్ ఏపి దిల్లాన్ తన పాటతో సందడి చేశాడు. ముందుగా కియారా అద్వాణీ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్కు చిందేసి అభిమానులను ఫిదా చేయగా.. అనంతరం కృతిసనన్తో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ప్రదర్శించారు. బిజిలీ పాటతో కియారా అద్వాణీ తన డ్యాన్స్ను ముగించగా.. చక్దే ఇండియా అంటూ జెండా ఊపుతూ కృతి సనన్ స్టేజ్పైకి వచ్చింది.
పరమ్ సుందరీ సాంగ్తో ఆమె డ్యాన్స్ ముగియగా.. దిల్లాన్ తన స్టైల్లో స్లేజీపైకి వచ్చాడు.
చివర్లో దిల్లాన్ కియారా అద్వాణీ, కృతి సనన్తో కలిసి చిందేసాడు. ఈ ఆరంభం వేడుకలకు మందిరా బేడి హోస్ట్గా వ్యవహరించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా ఆరంభ వేడకులకు సతీసమేతంగా హాజరయ్యాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్లతో పాటు ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లు స్టేజీ మీదకు రాగా.. డబ్ల్యూపీఎల్ టైటిల్ను ఆవిష్కరించారు. మైదానం మొత్తం వెలిగిపోయింది. డబ్యూపీఎల్ ఆరంభ మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. ప్రేక్షకులతో మైదానం కిక్కిరిసిపోయింది.
డబ్ల్యూపీఎల్ జట్ల కోసం ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టిన మొత్తం రూ.4,669 కోట్లు. అత్యధికంగా గుజరాత్ జెయింట్స్ కోసం అదానీ గ్రూప్ రూ.1,289 కోట్లు ఖర్చు చేయడం విశేషం. వేలంలో క్రికెటర్ల కొనుగోలు కోసం ఫ్రాంఛైజీలు రూ.59.50 కోట్లు వెచ్చించాయి. అత్యధిక ధర పలికిన క్రికెటర్ స్మృతి మంధానను రూ.3.4 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఇప్పటికే అమెరికాలోని మహిళల ఎన్బీఏ తర్వాత ప్రపంచంలోనే రెండో ఖరీదైన లీగ్గా డబ్ల్యూపీఎల్ గుర్తింపు పొందింది.
ఐపీఎల్ తరహాలోనే లీగ్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనుండగా.. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించనున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి.