టీమిండియా యువ పేసర్ ఆకాష్ దీప్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలో వికెట్ తీసిన తర్వాత ఆకాష్ దీప్ వ్యవహరించిన తీరు సరైంది కాదన్నాడు. ఇంగ్లండ్తో ఓవల్ వేదికగా జరగుతున్న ఐదో టెస్ట్లో బెన్ డకెట్ ఔటైన తర్వాత ఆకాష్ దీప్ అతిగా ప్రవర్తించాడు. తన బౌలింగ్లో ఔటై పెవిలియన్ చేరుతున్న డకెట్ భుజాలపై చేతులు వేసి మరి ఏదో మాట్లాడాడు.
సహజంగా బ్యాటర్ ఔటైన తర్వాత చాలా చికాకులో ఉంటాడు. ఇలాంటి సందర్భంలో బౌలర్ మందలించినా బ్యాటర్కు కోపం వస్తుంటుంది. అలాంటిది ఆకాష్ దీప్ ఎగతాళి చేస్తూ బెన్ డకెట్పై చేతులు వేసి మరి సెండాఫ్ ఇచ్చాడు. ఆకాష్ దీప్ చర్యకు ఏ మాత్రం సహనం కోల్పోని బెన్ డకెట్ మౌనంగానే మైదానం వీడాడు. అయితే ఈ చర్యను మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారత మాజీ ఆటగాళ్లతో పాటు ఇతర దేశ ప్లేయర్లు కూడా ఆకాష్ దీప్పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ ఘటనపై అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన రికీ పాంటింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తానే బెన్ డకెట్ స్థానంలో ఉండి ఉంటే ఆకాష్ దీప్ చెంపలు వాయించేవాడినని తెలిపాడు. సంయమనం పాటించిన బెన్ డకెట్పై ప్రశంసల జల్లు కురిపించాడు.
'ఈ ఘటన చూసినప్పుడు నాకు వారు స్నేహితులై ఉండాలి లేదా ఇద్దరు కలిసి ఆడిన సందర్భమైనా ఉండాలని అనుకున్నాను. లోకల్ పార్క్ గేమ్లో తప్పా మరెక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవు. నేనే బెన్ డకెట్ స్థానంలో ఉంటే ఆకాష్ దీప్ చెంపలు వాయించేవాడిని. కానీ బెన్ డకెట్ సంయమనం పాటించడం బాగుంది. సహజంగానే అతని ఆట అంటే నాకు చాలా ఇష్టం. తాజా ఘటనలో మౌనంగా ఉండటంతో అతను నాకు మరింత నచ్చాడు.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులు చేసింది. 27 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 75/2తో నిలిచింది. క్రీజులో యశస్వి జైస్వాల్(51 బ్యాటింగ్)తో పాటు ఆకాష్ దీప్(4) ఉన్నాడు.