న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతోంది. మరో రెండు నెలల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అక్టోబర్ 5న భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచకప్ కోసం ఆయా జట్లన్నీ సిద్దమవుతున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనడంపై డబుల్ గేమ్ ఆడిన పాకిస్థాన్ మెత్తబడింది.
వరల్డ్ కప్ కోసం తమ జట్టును పంపుతున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. తాజాగా ఆస్ట్రేలియా 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇతర జట్లు కూడా ప్రపంచ కప్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో ఫోజులిచ్చాడు. ఈ టైటిల్ ముచ్చటగా ఉందని, ఈసారి ఈ ట్రోఫీని ముద్దాడుతామని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు.

రోహిత్ వ్యాఖ్యలు నిజమవుతాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సొంతగడ్డపై ఈ టోర్నీ జరగనుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమంటున్న ఫ్యాన్స్.. గ్రహాలన్ని భారత్కు అనుకూలంగా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. ఆతిథ్య దేశానికి సంబంధించిన సెంటిమెంట్ రిపీట్ అయితే టీమిండియానే విశ్వవిజేతగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
2011లో భారత్ వేదికగా ప్రపంచకప్ జరగ్గా.. ఆ ఏడాది టీమిండియానే విజేతగా నిలిచింది. 2015లో ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియా టైటిల్ అందుకుంది. 2019లో ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్ కూడా విజేతగా నిలిచిందని, ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ ఏడాది వరల్డ్ కప్ను కూడా భారత్ గెలుస్తుందని నెటిజన్లు ధీమాగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్తో భారత్ తమ క్యాంపైన్ ప్రారంభించనుంది. అక్టోబర్ 14న పాకిస్థాన్తో అహ్మదాబాద్ వేదికగా తలపడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆసియాకప్ ఆడనుంది. ఆగస్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.