మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో సత్తా చాటిన టీమిండియా యువ స్పిన్నర్, తెలుగు తేజం శ్రీ చరణి తన ఫేవరేట్ హీరో ప్రభాస్ అని తెలిపింది. తనకు సినిమాలు అంటే చాలా ఇష్టమని, కానీ ఈ మధ్య ఎక్కువగా చూడటం లేదని చెప్పింది. గతంలో ప్రభాస్ మూవీ ఏది వచ్చినా వెంటనే చూసేదాన్ని అని గుర్తు చేసుకుంది.
మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆంధ్ర ప్రదేశ్, కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి.. 9 మ్యాచ్ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. 9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్లో వికెట్ తీసింది. ఫైనల్తో సహా సెమీఫైనల్లో శ్రీ చరణి కట్టడిగా బౌలింగ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచకప్ ఆడిన తొలి క్రికెటర్ గుర్తింపు పొందిన శ్రీచరణి.. పటిష్టమైన ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్తో పాటు సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఆసీస్పై ఆమె 5 వికెట్లు పడగొట్టింది. సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ.. భారత జట్టులో శ్రీ చరణి ప్రమాదకరమైన బౌలర్ అని కొనియాడింది.
ఈ టోర్నీకి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాల గురించి శ్రీ చరణి చెప్పుకొచ్చింది. తాను మంచి ఫుడ్ లవర్నని, స్వీట్లు తప్ప మిగిలిన అన్నింటిని ఇష్టంగా తింటానని తెలిపింది. ' నేను మంచి భోజన ప్రియురాలిని. స్వీట్లు తప్ప మిగిలిన అన్నింటినీ కడుపు నిండా తింటాను. అమ్మ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం. క్రికెట్ టోర్నీల కారణంగా ఈ మధ్య ఇంటి భోజనానికి దూరమయ్యా. నేను బాగా ఆడకపోతే.. తినకపోవడం వల్లే అనుకొని మా అమ్మ ప్రత్యేకంగా వండి పెడుతుంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మధ్య ఎక్కువ సినిమాలు చూడడం లేదు కానీ ఒకప్పుడు ప్రభాస్ మూవీ ఏది వచ్చినా వదిలేదాన్ని కాదు. ప్రభాష్ అంటే నాకు చాలా ఇష్టం.
మైదానంలో నేను అస్సలు ఒత్తిడికి గురికాను. ఒక బంతి బాగా వేయకపోతే మరుసటి బంతి మెరుగ్గా వేసేందుకు ప్రయత్నిస్తా. నేను ఎదుటి వాళ్లు చెప్పేది శ్రద్దగా వింటాను. వాళ్లు ఏ ధోరణిలో చెప్పినా నా మేలు కోరే చెబుతున్నారు కదా? అని ఆ విషయాలను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తా. అదే నా బలం.'అని శ్రీచరణి చెప్పుకొచ్చింది.