మహిళల వన్డే ప్రపంచకప్ విజేత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విధ్వంసకర వికెట్ కీపర్ రిచా ఘోష్ను వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.. సిలిగురి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ)గా నియమించింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) హోదాలో ఆమె ఈ బాధ్యతలు చేపట్టింది. వెస్ట్ బెంగాల్ డీజీపీ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) శ్రీ రాజీవ్ కుమార్(ఐపీఎస్) చేతుల మీదుగా రిచా ఘోష్ బాధ్యతలు స్వీకరించింది.
పోలీస్ డ్రెస్లో రిచా ఘోష్ డీజీపీని కలవగా.. ఈ ఫొటోలను ఎక్స్ వేదికగా వెస్ట్ బెంగాల్ పోలీస్ విభాగం పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. లేడీ సింగం రిచా ఘోష్ అని ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్రికెటర్ నుంచి పోలీస్ అధికారిగా నియామకమైన రిచా ఘోష్ జీవిత ప్రయాణానికి సంబంధించిన వీడియోను కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు విజేతగా నిలవడంలో 22 ఏళ్ల రిచా ఘోష్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దాంతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్లేయర్ అయిన రిచా ఘోష్కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ.34 లక్షల క్యాష్ ప్రైజ్ అందజేసింది. అంతేకాకుండా బంగా బిభూషణ్ అనే బిరుదును ప్రకటించింది. రిచా ఘోస్ స్వస్థలమైన సిలిగురిలోని చందమణి టీ ఎస్టేట్ ప్రాంతంలో ఆమె పేరు మీద కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తామని ప్రకటించింది.
పవర్ హిట్టర్ అయిన రిచా ఘోష్ 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. మఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్లో దూకుడుగా ఆడి భారత్కు భారీ లక్ష్యాన్ని అందించింది. 8 మ్యాచ్లు ఆడిన రిచా ఘోష్ 39.16 సగటు 133.52 స్ట్రైక్రేట్తో 235 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్దే అత్యుత్తమ స్ట్రైక్రేట్. ఈ టోర్నీలో మొత్తం 12 సిక్స్లు బాదిన రిచా ఘోష్.. ఒక ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత ప్లేయర్గా నిలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీకి రిచా ఘోష్ ప్రాతినిథ్యం వహిస్తోంది.