హరారే: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్ మ్యాచ్ల్లో జింబాబ్వే దుమ్మురేపుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఓటమెరుగని జట్టుగా నిలిచిన జింబాబ్వే.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు చుక్కలు చూపించింది. సోమవారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో అమెరికా బౌలర్లను జింబాబ్వే బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ సీన్ విలియమ్స్(101 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్స్లతో 174) భారీ సెంచరీ బాదగా.. ఓపెనర్ జోయ్లార్డ్ గుంబీ(103 బంతుల్లో 5 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఆల్రౌండర్ సికిందర్ రాజా(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 48), ర్యాన్ బర్ల్(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 47) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే ధాటికి అమెరికా బౌలర్లు తేలిపోయారు. పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. అభిషేక్ పరాద్కర్ మూడు వికెట్లు తీయగా.. జెస్సీ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో జింబాబ్వేకు ఇదే అత్యధిక స్కోర్.
ఇక సెంచరీ సాధించిన జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో 36 ఏళ్ల వయసులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ గేల్ 39 ఏళ్ల వయసులో 162 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే తరఫున మూడో అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా విలియమ్స్ నిలిచాడు. సీకే కోవెంట్రీ(194 నాటౌట్), మసకడ్జా(178 నాటౌట్) విలియమ్స్ కంటే ముందున్నారు.

409 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 44 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అమెరికా బ్యాటర్లలో ఇద్దరు రనౌటయ్యారు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే జింబాబ్వే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించనుంది.
గత మ్యాచ్లో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ను 35 పరుగులతో మట్టికరిపించిన జింబాబ్వే.. తమ క్వాలిఫికేషన్ అడ్డంకులను తొలిగించుకుంది. ప్రస్తుతం పాయింట్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.