చెన్నై: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. 12 ఏళ్ల తర్వాత మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచకప్ ఫీవర్ మొదలైంది. మెగా టోర్నీ నేపథ్యంలో భారత ఆటగాళ్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది.
సన్నిహితులు, బంధువులు, మిత్రుల నుంచి మ్యాచ్ టికెట్ల కోసం ఒత్తిడి పెరిగింది. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందే సిద్దమయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తన ఫ్రెండ్స్, బంధువులు, సన్నిహితులతో పాటు తన అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ఎవరూ కూడా తనను టికెట్లు అడగవద్దని, హాయిగా ఇళ్లలో నుంచి ప్రపంచకప్ను ఆస్వాదించాలని కోరాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

'ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నా స్నేహితులందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ కూడా టోర్నీ ముగిసే వరకు టికెట్ల కోసం నన్ను విసిగించవద్దు. ఇంటిలో నుంచే మ్యాచ్లను ఆస్వాదించండి. ప్లీజ్'అని ఫన్నీ ఏమోజీతో పేర్కొన్నాడు.
ఈ స్టోరీపై విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తనదైన శైలిలో బదులిచ్చింది. కోహ్లీ కాదన్నాడని తనను ఇబ్బంది పెట్టవద్దని కోరింది.
అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదీ పాకిస్థాన్తో అమీ తుమీ తేల్చుకోనుంది.
సొంతగడ్డపై జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. మళ్లీ విశ్వ విజేతగా నిలవలేదు. మరోసారి భారత్ వేదికగానే ప్రపంచకప్ జరుగుతుండటంతో టీమిండియా విజేతగా నిలుస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రాణించడంపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
బ్యాటింగ్లో ఈ ఇద్దరూ చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది.