న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్కు మరోసారి కోహ్లీ సెగ తగిలింది. వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో బ్యాటింగ్కు వచ్చిన ఈ అఫ్గాన్ యువ పేసర్కు కోహ్లీ అభిమానులు చుక్కలు చూపించారు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇన్నింగ్స్ ముగిసి మైదానం వీడే వరకు కోహ్లీ నామస్మరణంతో స్డేడియం దద్దరిల్లేలా చేశారు.
కామెంటేటర్లు సైతం నవీన్ ఉల్ హక్పై సెటైర్లు పేల్చారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఆటను చూస్తున్న అభిమానులు.. ఒక్కసారిగా కోహ్లీ కోహ్లీ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టడంతో కామెంటేటర్లతో పాటు అంపైర్లు, ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఎందుకలా అరుస్తున్నారని చూస్తే.. క్రీజులోకి నవీన్ ఉల్ హక్ రావడం గమనించారు.

రవి శాస్త్రి అయితే తనదైన శైలిలో సెటైర్లు పేల్చుతూ నవ్వులు పూయించాడు. 'నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్కు దిగడంతో స్డేడియం మొత్తం కోహ్లీ నామస్మరణంతో దద్దరిల్లుతోంది. ఎందుకో ఈ అద్భుతం? చెప్పినవారికి ఎలాంటి ప్రైజ్ లేదు.'అని రవిశాస్త్రి చమత్కరించాడు.
ఐపీఎల్ 2023 సందర్భంగా విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. లక్నో వేదికగా ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రెండో మ్యాచ్లో జరిగిన ఈ గొడవ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఘటనగా నిలిచిపోయింది. కోహ్లీ- నవీన్ ఉల్ హక్ గొడవ కాస్త మ్యాచ్ అనంతరం గంభీర్-కోహ్లీగా మారింది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేవరకు వెళ్లింది.
కోహ్లీ పదే పదే పిచ్పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్ అంపైర్లకు ఫిర్యాదు చేయడం గొడవకు కారణమైంది. తాను పిచ్పైకి వెళ్లలేదని, కావాలంటే తన షూస్ను చూడవచ్చని, ఎలాంటి మట్టి లేదని కోహ్లీ కాలిని పైకెత్తాడు. ఈ క్రమంలోనే నవీన్ ఉల్ హక్ను కోహ్లీ మందలించాడు. దాంతో అందరూ కోహ్లీని అపార్ధం చేసుకున్నారు.
నవీన్ ఉల్ హక్కు కోహ్లీ కాలు చూపించాడని భావించారు. గంభీర్ కూడా ఇలానే పొరపడి కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో కోహ్లీ ఏదో సూచనలు చేయబోగా.. నవీన్ ఉల్ హక్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. దాంతో గొడవ పెద్దది అయ్యింది.
అనంతరం ఈ గొడవ సోషల్ మీడియా వేదికగా కూడా కొనసాగింది. విరాట్ కోహ్లీ విడిచిపెట్టినా.. నవీన్ ఉల్ హక్ వదిలేయలేదు. మరో ఐపీఎల్ మ్యాచ్లో కోహ్లీ ఔటవ్వగా.. స్వీట్ మ్యాంగోస్ అంటూ ట్వీట్ చేశాడు. అది కోహ్లీ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి నవీన్ ఉల్ హక్కు ప్రతీ మ్యాచ్లో కోహ్లీ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులే చేసింది. హష్మతుల్లా షాహిది(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 80), అజ్మతుల్లా ఓమర్జీ(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. జస్ప్రీత్ బుమ్రా(4/34) అఫ్గాన్ పతనాన్ని శాసించారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్కు తలో వికెట్ దక్కింది.