న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో కోహ్లీ తన చర్యతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్తో కోహ్లీకి గతంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ వాగ్వాదం నేపథ్యంలో కోహ్లీ ఫ్యాన్స్ నవీన్ ఉల్ హక్ను టార్గెట్ చేశారు.
అతను మైదానంలోకి వచ్చినప్పటి నుంచి కోహ్లీ కోహ్లీ అని అరుస్తూ నవీన్ ఉల్ హక్ను ట్రోల్ చేశారు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టారు. ఫీల్డింగ్ సమయంలోనూ తెగ ఇబ్బంది పెట్టారు. ఇది గమనించిన విరాట్ కోహ్లీ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.

ఆటగాళ్లను ఎంకరేజ్ చేయాలే తప్ప ట్రోల్ చేయవద్దని తన సైగలతో స్పెషల్గా రిక్వెస్ట్ చేశాడు. కోహ్లీ సూచనలతో అభిమానులు సైలెంట్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇక నవీన్ ఉల్ హక్ సైతం విరాట్ కోహ్లీ దగ్గరకు వచ్చి హగ్ చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 26వ ఓవర్లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని కోహ్లీ బౌండరీ బాదాడు. రెండో బంతి వేసే ముందు కోహ్లీ దగ్గరకు వచ్చిన నవీన్ ఉల్ హక్.. అతనితో మాట్లాడుతూ హగ్ చేసుకున్నాడు. కోహ్లీ సైతం నవ్వుతూ అతన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఈ చర్యతో ఈ ఇద్దరూ తమ మధ్య ఉన్న గొడవకు ముగింపు పలికినట్లు అయ్యింది.
విరాట్ కోహ్లీ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. కోహ్లీ గొప్ప వ్యక్తి అనడగానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. 2019 వన్డే ప్రపంచకప్లోనూ స్టీవ్ స్మిత్ను ఛీటర్ ఛీటర్ అంటూ అభిమానులు ఎగతాళి చేసినప్పుడు అలా అనవద్దని సూచించాడు.
ఆటగాళ్లను ఎంకరేజ్ చేయాలే తప్పా ట్రోల్ చేయవద్దని కోరాడు. అప్పట్లోనూ ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తాజా నవీన్ ఉల్ హక్ ఉదంతంతో స్మిత్ ఘటనను కూడా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులే చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. రోహిత్ శర్మ(84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్లతో 131) సూపర్ సెంచరీ.. విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 6 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో 35 ఓవర్లలో 2 వికెట్లకు 273 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.