హైదరాబాద్: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసిన వన్డే ప్రపంచకప్ 2023 మొదలైంది. గత టోర్నీ ఫైనలిస్ట్ల మధ్య రసవత్తరపోరుతో ఈ సీజన్కు తెరలేచింది. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం వేదికగా వన్డే ప్రపంచకప్ అట్టహాసంగా ప్రారంభమవ్వగా.. రెండో మ్యాచ్ కు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.
దాయాదీ పాకిస్థాన్.. పసికూన నెదర్లాండ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్ చేరుకొని ముమ్మరంగా సాధన చేశాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన రెండు వామప్ మ్యాచ్ల్లో పాకిస్థాన్ ఓడినప్పటికీ.. మంచి ప్రాక్టీస్ లభించింది. ఉప్పల్ పిచ్పై పాక్కు క్లారిటీ వచ్చింది.

ఈ మ్యాచ్లో పాకిస్థానే హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నప్పటికీ నెదర్లాండ్స్ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. క్వాలిఫయర్ టోర్నీలో వెస్టిండీస్ వంటి భీకర జట్టును మట్టికరిపించి ఆ జట్టు వరల్డ్ కప్ బెర్త్ను దక్కించుకుంది.
ఇక నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్న తేజ నిడమానురు.. తెలుగు క్రికెటర్ కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు చెందిన తేజ నిడమానురు.. నెదర్లాండ్స్లో ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. పాకిస్థాన్తో హైదరాబాద్ వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్కు అతని కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు.
క్వాలిఫయర్ టోర్నీలో తేజ నిడమానూరు జింబాబ్వేపై సెంచరీ సాధించాడు. 110 పరుగులతో అజేయంగా నిలిచి నెదర్లాండ్స్కు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ గడ్డపై తన కుటుంబ సభ్యుల మధ్య ఎలా రాణిస్తాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక పాకిస్థాన్ జట్టులో బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్లో ఉన్నారు.
భారత్తో అక్టోబర్ 14న మ్యాచ్ ఉన్న నేపథ్యంలో నెదర్లాండ్స్తో మ్యాచ్ను సన్నాహకంగా వాడుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.
తుది జట్లు(అంచనా):
ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది, హ్యారీస్ రౌఫ్, హసన్ అలీ
నెదర్లాండ్: విక్రమ్జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, వెస్లీ బారెసి, బాస్ డీ లీడే, సైబ్రాండ్, తేజ నిడమానురు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), రోయిలోఫ్ వాన్ డీ మెర్వే, లోగన్ వాన్ బీక్, పాల్ వాన్ మెకెరెన్, ఆర్యన్ దత్.