న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కైవసం చేసుకుంటుందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఉపఖండం వేదికగా మెగా టోర్నీ జరుగుతున్నా.. భారత్, పాకిస్థాన్ జట్లకు మెగా టోర్నీ గెలిచే సత్తా లేదన్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉందని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న గవాస్కర్.. ప్రపంచకప్ గెలిచే జట్టును అంచనా వేసాడు. 'వన్డే ప్రపంచకప్ 2023ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే టైటిల్ గెలిచే సత్తా ఆ జట్టుకు మాత్రమే ఉంది. బ్యాటింగ్ విభాగం.. బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది.

మ్యాచ్ను మలుపు తిప్పగల వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్లు ముగ్గురు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. బౌలింగ్ లైనప్లో కూడా ఎంతో అనుభవం కలిగిన బౌలర్లు ఉన్నారు. కాబట్టి నా అంచనా ప్రకారం ఇంగ్లండ్ విజేతగా నిలుస్తోంది.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
అయితే టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భారత్కే ప్రపంచకప్ గెలిచే సత్తా ఉందని తెలిపాడు. 'వన్డే ప్రపంచకప్లో ఫేవరేట్గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఎలా ఆడుతుందా? అనేదాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రపంచకమ్ ముందు జరిగిన సిరీస్ల్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఆసియాకప్తో పాటు ఆస్ట్రేలియాతో సిరీస్లను కైవసం చేసుకుంది.

అన్ని బలహీనతలను అధిగమించింది. ప్రధాన జట్టే కాకుండా బెంచ్ ఆటగాళ్లు కూడా సూపర్ ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. ఉదహారణకు మహమ్మద్ షమీని తీసుకుంటే.. అతను తుది జట్టులో లేకున్నా.. అవకాశం వచ్చినప్పుడు చెలరేగేందుకు సిద్దంగా ఉన్నాడు.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో భారత్ తమ ప్రపంచకప్ క్యాంపైన్ ప్రారంభించనుంది. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.