World Cup 2023: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఉంది శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) పరిస్థితి. వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనతో ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC) కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేయగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సస్పెన్షన్ విధించింది.
ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా శ్రీలంక క్రికెట్ బోర్డు పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నందుకు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

'ఐసీసీ బోర్డు ఈ రోజు సమావేశమై శ్రీలంక క్రికెట్ బోర్డులో నెలకొన్న వ్యవహారాలపై చర్చించింది. ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడం గుర్తించింది. ఇది తీవ్ర ఉల్లంఘనగా భావించి శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధించింది. ఈ సస్పెన్షన్ షరతులను త్వరలోనే ఐసీసీ బోర్డు వెల్లడిస్తోంది.'అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఐసీసీ త్రైమాసిక సమావేశం నవంబర్ 18-21 మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ఆన్లైన్ వేదికగా అత్యవసరంగా సమావేశమైంది. శ్రీలంక బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం కావడాన్ని ఐసీసీ సీరియస్గా పరిగణించింది.
బోర్డు పరిపాలన, ఆర్థిక విషయాలతో పాటు టీమ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని ఐసీసీ బోర్డు భావించింది. తాత్కలిక సస్పెన్షన్ గురించి శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలియజేసిన ఐసీసీ.. నవంబర్ 21న జరిగే వార్షిక సమావేశంలో తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ప్రపంచకప్ 2023 టోర్నీలో శ్రీలంక దారుణంగా విఫలమైంది. తొమ్మిది లీగ్ మ్యాచ్లకు రెండు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్పై విజయం సాధించిన శ్రీలంక మిగతా మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. భారత్ చేతిలో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్ఎల్సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు.
మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంత కమిటీని నియమించారు. బోర్డు రద్దు తీర్మానానికి శ్రీలంక పార్లమెంట్ ఏకగీవ్రంగా ఆమోదం తెలిపింది.