గువాహటి: వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో శ్రీలంకతో జరిగిన వామప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. గువాహటి వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(64 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 68), ధనంజయ డిసిల్వా(79 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 55) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్దీ హసన్(3/36) మూడు వికెట్లు తీయగా.. తంజీమ్ హసన్ షకీబ్, షోరిఫుల్ ఇస్లామ్, నాసుమ్ అహ్మద్, మెహ్దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 42 ఓవర్లలో 3 వికెట్లకు 264 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ తంజిద్ హసన్(88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 84), లిటన్ దాస్(56 బంతుల్లో 10 ఫోర్లతో 61),మెహ్దీ హసన్ మీరాజ్(64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 67 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో లాహిరు కుమారా, దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత తలో వికెట్ తీసారు.
ఇక అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా జరగాల్సిన వామప్ మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.