ముంబై: వన్డే ప్రపంచకప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. సౌతాఫ్రికాతో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఇంగ్లండ్కు ఇది అత్యంత ఘోర పరాజయం.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రీచ్ క్లాసెన్(67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రీజా హెండ్రీక్స్(75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 85), రాసీ వాన్ డెర్ డస్సెన్(61 బంతుల్లో 8 ఫోర్లతో 60), మార్కో జాన్సెన్(42 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 75 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లీ(3/63) మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్(2/61), గస్ అట్కిన్సన్కు రెండేసి వికెట్లు దక్కాయి.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 22 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. గెరాల్డ్ కోయిట్జ్ (3/35) మూడు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి(2/26), మార్కో జాన్సెన్(2/35) రెండేసి వికెట్లు తీసారు. కగిసో రబడా, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో మార్క్వుడ్ (17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 నాటౌట్), గస్ అట్కిన్సన్(21 బంతుల్లో 7 ఫోర్లతో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
జానీ బెయిర్ స్టో(10), డేవిడ్ మలాన్(6), జోరూట్(2), బెన్ స్టోక్స్(5), హ్యారీ బ్రూక్(17), జోస్ బట్లర్(15), డేవిడ్ విల్లే(12), ఆదిల్ రషీద్(10) అంతా దారుణంగా విఫలమయ్యారు.
ఈ ఘోర పరాజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పాయింట్స్ టేబుల్లో 9వ స్థానానికి పడిపోయింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఆ జట్టు మిగిలిన 5 మ్యాచ్లకు ఐదు గెలవడంతో పాటు రన్రేట్ మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అఫ్గానిస్థాన్తో ఓటమి అనంతరం ఇంగ్లండ్ పూర్తిగా ఢీలా పడిపోయింది.