హైదరాబాద్: విజయానందంలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్. వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్కు దూరమైన టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ రెండో మ్యాచ్కు కూడా ఆడటం లేదు. డెంగ్యూ బారిన పడిన శుభ్మన్ గిల్ ఇంకా కోలుకోలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం ప్రకటించింది.
ప్రస్తుతం శుభ్మన్ గిల్ బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలోనే ఉన్నాడని, అఫ్గాన్తో తదుపరి మ్యాచ్ ఆడటం లేదని పేర్కొంది. టీమిండియాతో కలిసి ఢిల్లీకి కూడా వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
'టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదు. వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్కు దూరమైన శుభ్మన్ గిల్ అఫ్గానిస్థాన్తో ఢిల్లీ వేదికగా బుధవారం జరిగే మ్యాచ్ కూడా ఆడటం లేదు. అతను చెన్నైలోనే బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉంటాడు.'అని తెలిపింది.
ఇక శుభ్మన్ గిల్ గైర్హాజరీలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమవ్వగా.. టీమిండియా 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడింది. దాంతో శుభ్మన్ గిల్ విలువ అందరికి తెలుసొచ్చింది.

కనీసం అఫ్గానిస్థాన్తో ఢిల్లీ వేదికగా బుధవారం జరిగే రెండో మ్యాచ్లోనైనా బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. కానీ మెగా టోర్నీలో చాలా మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ మ్యాచ్ నుంచి కూడా శుభ్మన్ గిల్కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా మెడికల్ టీమ్ అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.
డెంగ్యూ నుంచి కోలుకున్నా.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు అతనికి తగిన సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే శుభ్గిల్ను ఆడించి అనవసర రిస్క్ చేయవద్దని టీమ్మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం పాకిస్థాన్తో మ్యాచ్కు అయినా అతను సిద్దం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(116 బంతుల్లో 6 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్(115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 97 నాటౌట్) చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీసాడు.