న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూపొందించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే ఈ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
క్రిక్బజ్ కథనం ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్లోనే వరల్డ్ బిగ్గెస్ట్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 5న ఈ మ్యాచ్తో వన్డే వరల్డ్కప్కు తెరలేవనుంది. నవంబర్ 18న అహ్మదాబాద్ వేదికగానే ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇక భారత్ తమ తొలి మ్యాచ్ను చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ 13వ ఎడిషన్ వన్డే ప్రపంచకప్లో మొత్తం 10 జట్లు పోటీపడనున్నాయి. ఆస్ట్రేలియాతో తొలి పోరు అనంతరం భారత్ అక్టోబర్ 15న పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ మొత్తం 10 వేదికలను షార్ట్ లిస్ట్ చేసింది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 18 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుండగా.. అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ధర్మశాల, ముంబై, మొహాలీ, రాజ్కోట్, గౌహతి, రాయ్పూర్, హైదరాబాద్ మైదానాలు ప్రపంకప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక వన్డే ప్రపంచకప్ కోసం భారత్ వచ్చేందుకు పాకిస్థాన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఇరు బోర్డుల మధ్య గొడవలు జరుగుతున్నా.. ప్రపంచకప్లో పాక్ ఆడేందుకు పీసీబీ చైర్మన్ నజమ్ సేథి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అహ్మదాబాద్ వేదికగా భారత్తో ఆడేందుకు మాత్రం సేథి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ మినహా మరో మ్యాచ్ అక్కడ ఆడలేమని చెప్పినట్లు సమాచారం.
మొత్తం 10 జట్ల మధ్య 48 మ్యాచ్లు జరగనుండగా.. 8 జట్లు ఇప్పటికే మెగా టోర్నీకి అర్హత సాధించాయి. భారత్, ఇంగ్లండ్,ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మెగా టోర్నీకి నేరుగా క్వాలిఫై అవ్వగా.. మరో రెండు జట్లు క్వాలిఫయర్స్ ఆడి ప్రధాన టోర్నీకి అర్హత సాధించనున్నాయి.
వెస్టిండీస్, శ్రీలంక, నేపాల్, యూఏఈ, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, ఓమన్, స్కాంట్లాండ్ మధ్య ప్రపంచకప్ క్వాలిఫయర్స్ జరగనున్నాయి.