తిరువనంతపురం: వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వామప్ మ్యాచ్ కోసం టీమిండియా తిరువనంతపురం చేరగా.. సంజూ శాంసన్ ఎమోషనల్ అయ్యాడు. వామప్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్ల ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంజూ శాంసన్.. జట్టులో చోటు దక్కకపోయినా.. టీమిండియాతో ఉన్నానని క్యాప్షన్గా పేర్కొన్నాడు.
నెదర్లాండ్స్తో వామప్ మ్యాచ్ ప్రారంభానికి ముందు కేరళ, తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మైదానంలో భారత ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. భారత ఆటగాళ్లు సాధన చేస్తుండగా.. పక్కనే ఉన్న బిల్డింగ్పై సంజూ శాంసన్ పెయింటింగ్ చిత్రం ఉంది. ఈ ఫొటోను షేర్ చేసిన సంజూ శాంసన్.. 'గాడ్స్ ఓన్ కంట్రీలో టీమిండియాతో నేను ఉన్నాను.'అని క్యాప్షన్గా పేర్కొన్నాడు.

ఈ పోస్ట్ నేపథ్యంలో అతని ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సరైన అవకాశాలు ఇవ్వకుండా సంజూ శాంసన్కు అన్యాయం చేశారని కామెంట్ చేస్తున్నారు. జట్టులో ఇతర ఆటగాళ్లకు ఇచ్చిన అవకాశాలు సంజూ శాంసన్కు ఇచ్చి ఉంటే ఎప్పుడో స్టార్ ప్లేయర్గా ఎదిగేవాడని అభిప్రాయపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కోసం సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించారని ఆరోపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ భారత జట్టుకు దూరం కావడంతో సంజూ శాంసన్కు అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా తీసుకోవడంతో సంజూ శాంసన్కు అవకాశం లేకపోయింది. లెఫ్ట్ హ్యాండర్ అయిన ఇషాన్ కిషన్ సత్తా చాటడంతో బ్యాకప్ వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు.
రాహుల్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడటంతో సంజూ శాంసన్ను స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేశారు. ఆ తర్వాత అతను కోలుకొని సెంచరీతో చెలరేగడంతో సంజూ శాంసన్ పేరే ప్రస్తావనకు రావడం లేదు.
అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను షురూ చేయనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదీ పాకిస్థాన్తో మెగా మ్యాచ్ ఆడనుంది.
ఇక తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్తో జరగాల్సిన వామప్ మ్యాచ్.. వర్షం కారణంగా రద్దయ్యింది.