న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఒక్క సెంచరీతో పలు అంతర్జాతీయ రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 63 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న రోహిత్ శర్మ.. వన్డే ప్రపంచకప్లో భారత్ తరఫున అత్యంత వేగంగా శతకం బాదిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్(72 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ రికార్డు నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ల్లో రోహిత్కు ఇది ఏడో సెంచరీ. 19 ఇన్నింగ్స్లో రోహిత్ 7 సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట(44 ఇన్నింగ్స్ల్లో 6)ఉన్న రికార్డును అధిగమించాడు.

అంతర్జాతీ క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన రికార్డును కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. అఫ్గాన్తో మ్యాచ్లో ఇప్పటికే 5 సిక్స్లు బాదిన రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలో కలిపి 473 ఇన్నింగ్స్ల్లో 556 సిక్స్లు బాదాడు.
ఈ క్రమంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(551 ఇన్నింగ్స్ల్లో 553 సిక్స్లు), అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్, గేల్ తర్వాత షాహిద్ అఫ్రిది(508 ఇన్నింగ్స్ల్లో 476 సిక్స్లు) ఉన్నాడు. ఇక వన్డే ప్రపంచకప్లో రోహిత్ 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులే చేసింది. హష్మతుల్లా షాహిది(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 80), అజ్మతుల్లా ఓమర్జీ(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. జస్ప్రీత్ బుమ్రా(4/34) అఫ్గాన్ పతనాన్ని శాసించారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్కు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా రోహిత్ సూపర్ సెంచరీతో విజయం దిశగా దూసుకెళ్తోంది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 47) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. క్రీజులోకి వచ్చిన విరాట్తో రోహిత్ శర్మ(129 బ్యాటింగ్) విజయం దిశగా నడిపిస్తున్నాడు. 23 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 194 పరుగులు చేసింది.