ధర్మశాల: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఓ క్యాలండర్ ఇయర్లో 50 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ 4 సిక్స్లు బాది ఈ ఫీట్ సాధించాడు.
మ్యాట్ హెన్రీ వేసిన రెండో ఓవర్లో డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాది తన పెరిటనే ఉన్న రికార్డును అధిగమించాడు. 2017లో రోహిత్ శర్మ.. వన్డేల్లో 47 సిక్స్లు బాదాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజాగా రోహిత్ మెరుగుపరుచుకున్నాడు.

ఓవరాల్గా ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ టాప్లో ఉన్నాడు. 2018లో ఈ సౌతాఫ్రికా దిగ్గజం 18 ఇన్నింగ్స్ల్లో 58 సిక్స్లు బాదాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ 2019లో 56 సిక్స్లు బాది రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరీ తర్వాత రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో రెండు మ్యాచ్ల్లో రోహిత్.. ఏబీ డివిలియర్స్ రికార్డును అధిగమించనున్నాడు.
వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. వన్డేల్లో ఓ ఏడాది 50 సిక్సర్లు బాదిన తొలి ఆసియా కెప్టెన్గా కూడా రోహిత్ గుర్తింపు పొందాడు. ఇక హాఫ్ సెంచరీ ముంగిట రోహిత్(46)ను ఫెర్గూసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్(127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 130) సెంచరీతో చెలరేగగా.. రచిన్ రవీంద్ర(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 75) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(5/54) కివీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(46), శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 71 పరుగులు జోడించిన అనంతరం రోహిత్, శుభ్మన్ గిల్ 5 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. క్రీజులో కోహ్లీ(7 బ్యాటింగ్), శ్రేయస్ అయ్యర్(21 బ్యాటింగ్) ఉన్నారు.