World Cup 2023, IND vs NZ semis: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా లీగ్ దశను ముగించిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. విశ్వవిజేతగా నిలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచిన టీమిండియా.. తొలి అడుగు వేసేందుకు రెడీ అయ్యింది. న్యూజిలాండ్ ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా సోమవారమే ముంబైకి చేరుకుంది. ఆదివారం నెదర్లాండ్స్తో బెంగళూరు వేదికగా చివరి లీగ్ మ్యాచ్ ఆడిన భారత్.. 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సోమవారం ఉదయం బెంగళూరులో ఫ్లైట్ ఎక్కిన భారత ఆటగాళ్లు సాయంత్రానికల్లా ముంబై చేరుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సతీ సమేతంగా జట్టుతో కలిసి ముంబైకి రాగా.. విరాట్ కోహ్లీ మాత్రం తనకు సంబంధించిన ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకున్నాడు.

ఈ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్న భారత ఆటగాళ్లు మంగళవారం ప్రాక్టీస్ చేయనున్నారు. లీగ్ దశలో 9 మ్యాచ్లకు 9 గెలిచిన రోహిత్ సేన.. ఇదే జోరులో సెమీఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించాలని భావిస్తోంది. ఇప్పటికే లీగ్ దశలో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్ ఓడించిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఇప్పుటికే ఒక మ్యాచ్లో ఓడినా న్యూజిలాండ్ను తక్కువ అంచనా వేయలేం. నాకౌట్ మ్యాచ్ల్లో ఆ జట్టు భారత్కు కొరకరాని కొయ్యలా మారింది.
ఏమాత్రం ఎమరపాటుగా ఉన్నా.. టీమిండియాకు భారీ నష్టం జరగనుంది. ఆ జట్టులో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ సూపర్ ఫామ్లో ఉండగా.. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ప్రస్తుత భారత ఫామ్ ముందు న్యూజిలాండ్ బలహీనమే అయినా.. సెమీస్ పోరులో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. టాపార్డర్ బ్యాటర్లు తమ జోరును కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.
ముంబైలోని వాంఖడే పిచ్ను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు బౌలింగ్ కోచ్ పారాస్ మాంబ్రేలు పరిశీలించారు.