న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ ఇంకా 100 రోజుల సమయం ఉన్నా.. దేశంలో ఆ ఫీవర్ అప్పుడే మొదలైంది. మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఐసీసీ మంగళవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది.
ప్రారంభ మ్యాచ్తో పాటు ఫైనల్తో కలిపి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం మొత్తం 5 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది అక్కడి హోటల్స్ యాజమాన్యానికి కలిసొచ్చింది. మెగా టోర్నీ ప్రారంభానికి ఇంకా 100 రోజుల సమయం ఉన్నా.. హోటల్స్ అలన్నీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసి ఫ్యాన్స్ క్రేజ్ను సొమ్ము చేసుకుంటున్నాయి.

అహ్మదాబాద్లోని హోటల్ రూమ్ టారిఫ్స్ చుక్కలు చూపిస్తున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగానే భారత్-పాక్ మ్యాచ్ జరగనుండటం హోటల్స్ వ్యాపారులకు కలిసొచ్చింది. హోటల్స్ టారిఫ్స్ అన్నీ డబుల్ అయ్యాయి.
సాధారణ రోజుల్లో రూ. 6,500 నుంచి రూ. 10,500 ఉండే ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ అద్దె ఏకంగా.. రూ. 50 వేలు దాటిపోయింది. మూడు నెలల ముందు బుక్ చేసుకున్నా ఇదే టారిఫ్ ఉంటుందని హోటల్ వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. బేస్ కేటగిరీ గదుల టారిఫ్ రూ.52 వేలు ఉండగా.. ప్రీమియమ్ కేటగిరీ గదుల అద్దె రోజుకు రూ.లక్షకుపైగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి.
'భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దాంతోనే అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు మూడు నెలల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశాం. మ్యాచ్ రోజుల్లోనే ఎక్కువ బుకింగ్లు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం'అని ఐటీసీ నర్మదా జనరల్ మేనేజర్ కీనన్ మెకంజీ నేషనల్ మీడియాకు తెలిపాడు.
అభిమానులు, స్పాన్సర్లు, వీవీఐపీల సందడి ఉంటుందని, ఫైవ్ స్టార్ హోటల్స్లో 60 - 90 శాతం వరకు మ్యాచ్ల కోసమే బుక్ అవుతాయని హయత్ రెగెన్సీ జీఎం పునీత్ బైజల్ తెలిపారు. 'మా ప్రాపర్టీస్లోని రెండింట్లోని గదులను అక్టోబర్ 14 - 16వ తేదీ వరకు బుకింగ్లు చేసేశాం.
దాదాపు 40 నుంచి 60 శాతం వరకు మిగతా మ్యాచ్ల సమయాల్లోనూ బుక్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని రూమ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి'' అని తాజ్ గ్రూప్ ప్రాపర్టీస్ను నిర్వహిస్తున్న శంకల్ప్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ బుద్ధరాజ పేర్కొన్నారు. హోటల్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి మూకుమ్మడిగా ధరలు పెంచేసారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటి నుంచే బుకింగ్స్ ఓపెన్ చేసి సొమ్ము చేసుకుంటున్నారని, రూమ్స్ను బ్లాక్ చేసి అధిక ధరలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.