చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్మురేపాడు. తనకు అచ్చొచ్చిన చెన్నై పిచ్పై బంతితో రఫ్ఫాడించాడు. జిడ్డు బ్యాటింగ్తో విసిగిస్తున్న స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46)ను స్టన్నింగ్ డెలివరీతో బోల్తా కొట్టించాడు.
ఆ మరుసటి ఓవర్లో మార్నస్ లబుషేన్(41 బంతుల్లో బౌండరీతో 27),అలెక్స్ క్యారీ(0)లను బంతి వ్యవధిలో పెవిలియన్ చేర్చి ఆసీస్ పతనాన్ని శాసించాడు. స్టీవ్ స్మిత్ను క్లీన్ బౌల్డ్ చేసిన జడేజా.. లబుషేన్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్ తొలి బంతికి స్టీవ్ స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతిని స్మిత్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. టర్న్ అయిన బంతి అతని బ్యాట్ను మిస్సై ఆఫ్ స్టంప్ టాప్ బెయిల్స్ను ఎగరగొట్టేసింది. ఈ బంతికి స్మిత్ బిత్తరపోయాడు. సూపర్ బాల్ అంటూ జడేజాను మెచ్చుకుంటూ ఆశ్చర్యంగా క్రీజును వీడాడు.
ఆ మరుసటి ఓవర్లో కుల్దీప్ యాదవ్ పరుగులివ్వకుండా ఇబ్బంది పెట్టగా.. 30వ ఓవర్లో జడేజా చేయాల్సిన నష్టం చేసేశాడు. బంతి వ్యవధిలోనే వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసాడు. జడేజా ధాటికి ఆసీస్ 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్, మ్యాక్స్వెల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అంతర్జాతీయ క్రికెట్లో స్మిత్ను ఔట్ చేయడం జడేజాకు ఇది 11వ సారి. అతని కెరీర్లోనే ఇది హయ్యెస్ట్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్తో ఓపెనర్ మిచెల్ మార్ష్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన స్మిత్తో కలిసి వార్నర్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ఆసీస్ వికెట్ నష్టానికి 43 పరుగులే చేసింది.
69 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41)ను రిటర్న్ క్యాచ్గా బోల్తా కొట్టించాడు.