హైదరాబాద్: టీమిండియా వన్డే ప్రపంచకప్ సన్నాహకాలకు వరణుడు పదే పదే ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్తో జరగాల్సిన వామప్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. తాజాగా నెదర్లాండ్స్తో తిరువనంతపురం వేదికగా ప్రారంభం కావాల్సిన రెండో వామప్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. భారీ వర్షం రావడంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పివేసారు.
ప్రస్తుతానికి వర్షం తగ్గడంతో కవర్లను తొలగించారు. చిత్తడిగా మారిన మైదానాన్ని పొడిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ వర్షం రాకపోతే మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వర్షం వస్తే మాత్రం ఈ మ్యాచ్ కూడా రద్దవ్వనుంది. మెగా టోర్నీలో టీమిండియాను వరుణ గండం వెంటాడుతోంది. వర్షంతో మ్యాచ్కు అంతరాయం కలిగిన ప్రతీసారి టీమిండియాకు ప్రతికూల ఫలితమే ఎదురైంది.

2019 వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్డేతో కలుపుకొని రెండు రోజుల పాటు సాగింది. బౌలింగ్లో సత్తా చాటిన టీమిండియా.. ఓవర్ కాస్ట్ కండిషన్స్ వల్ల బ్యాటింగ్లో విఫలమై ఓటమిపాలైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తొలి ఎడిషన్ ఫైనల్లోనూ టీమిండియాను వరణుడు కొంపముంచాడు.
రిజర్వ్డేతో కలుపుకొని 6 రోజుల పాటు సాగిన మ్యాచ్లో వాతావరణ పరిస్థితులు టీమిండియా ఆటను ప్రభావితం చేశాయి. దాంతో మరోసారి టీమిండియా తృటిలో టైటిల్ చేజార్చుకుంది. అంతకు ముందు కూడా కీలక మ్యాచ్ల్లో వర్షం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే టీమిండియాను వరుణ గండం వెంటాడుతుందని, దోష నివారణ పుజ చేయించాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ శని పూజ చేయాలని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.