మొహాలీ: వన్డే ఫార్మాట్లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ చోటుకు వచ్చిన ఢోకా ఏమీ లేదని స్పష్టం చేశాడు. సూర్యకు టీమ్మేనేజ్మెంట్ మద్దతు ఉంటుందని తెలిపాడు.
అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వన్డేల్లో పెద్దగా రాణించని సూర్యను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అతని కంటే సంజూ శాంసన్కు మెరుగైన రికార్డు ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

ఆసియాకప్ 2023లోనూ సూర్య విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే సూర్యను తప్పించి సంజూ శాంసన్ను తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఆసీస్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. సూర్యపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాడు. ఆరో స్థానంలో సూర్యనే సరైనవాడని అభిప్రాయపడ్డాడు.
'వరల్డ్ కప్ జట్టులో చోటు గురించి సూర్య దిగుపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మేం వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసుకున్నాం. ఇందులో సూర్య ఉన్నాడు. మా నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అతనికి పూర్తిగా మద్దతుగా నిలుస్తాం. టీ20 క్రికెట్లో అతని సత్తా ఏమిటో అందిరికి తెలుసు. అతని నైపుణ్యాలు, సామర్థ్యాలపై మాకు నమ్మకం ఉంది.
వన్డేల్లో ఆరో స్థానంలో సూర్య బ్యాటింగ్ చేయగలడు. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు. సూర్య అసాధారణ ఆటగాడు. తనదైన రోజున అతన్ని ఆపడం కష్టం. అందుకే అతనికి మేం మద్దతు ఇస్తున్నాం. ఆసీస్తో వన్డే సిరీస్లో అతను సత్తా చాటుతాడని ఆశిస్తున్నా.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యల నేపథ్యంలో సంజూ శాంసన్కు చోటు దక్కదనే విషయం స్పష్టమైంది. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు మొత్తంగా 28 వన్డేల్లో 24.41 యావరేజ్తో 537 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ 13 వన్డేల్లో 55.71 సగటుతో 390 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.