న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మెగా టోర్నీలో దాయాదీ దేశం పాల్గొనడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. మెగా టోర్నీ ఆడే విషయంపై పీసీబీ ఇప్పటి వరకు ఎలాంటి లిఖితపూర్వక కమిట్మెంట్ ఇవ్వలేదని ఐసీసీ బోర్డు అధికారి ఒకరు వార్త సంస్థ పీటీఐకి తెలిపారు.
'టీమిండియా.. పాకిస్థాన్ వెళ్లడం, పాకిస్థాన్ టీమ్ భారత్కు రావడం అనేది పీసీబీ, బీసీసీఐలపై ఆధారపడి ఉంది. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో పాల్గొనే విషయంపై పీసీబీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బీసీసీఐ తరహాలోనే ఆ జట్టు పాల్గొనడంపై పాక్ ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంది. ఆ దేశ ప్రభుత్వ అనుమతికి లోబడి మాత్రమే పీసీబీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.'అని సదరు అధికారి వెళ్లడించాడు.

మరోవైపు మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే పూర్తి చేసింది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే ప్రకటించనుంది. మెగా టోర్నీలో పాకిస్థాన్ మ్యాచ్లు ఎక్కువగా దక్షిణ భారత దేశంలో జరగనున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆడేందుకు పీసీబీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆసియాకప్ 2023 నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీని పాకిస్థాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ భద్రతా కారణాలు, ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ వెళ్లేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. దాంతో పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను తీసుకొచ్చింది.
భారత్ ఆడే మ్యాచ్లను తటస్థ వేదికైన దుబాయ్ వేదికగా నిర్వహిస్తామని, మిగతా మ్యాచ్లను పాక్ వేదికగా జరుపుతామని చెప్పింది. కానీ ఈ ప్రతిపాదనను శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు వ్యతిరేకిస్తున్నాయి. ఉక్కపోతగా ఉండే దుబాయ్లో ఆడేందుకు ససేమిరా అంటున్నాయి. భారత్తో దుబాయ్ వేదికగా ఆడి మళ్లీ పాక్కు ప్రయాణించడం చాలా కష్టమైన పనని వాదిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆసియాకప్ 2023ను శ్రీలంకకు తరలించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని పీసీబీ భావిస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో ఆసియాకప్ 2023 టోర్నీని రద్దు చేసి మల్టీ నేషనల్ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆసియాకప్ నిర్వహణపై స్పష్టత వచ్చిన తర్వాతే పీసీబీ.. వన్డే ప్రపంచకప్ ఆడటంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.