హైదరాబాద్: వన్డే ప్రపంచకప్లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్ మ్యాచ్లు లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న నగరవాసులకు మరో షాకింగ్ న్యూస్. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు హైదరాబాద్లో జరగనున్న తొలి వామప్ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ నెల 29న ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య సన్నాహక మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ మ్యాచ్ను ఖాళీ స్టేడియం నిర్వహించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( హెచ్సీఏ)తో పాటు బీసీసీఐ నిర్ణయించింది. ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగ ఉండటంతో ఈ మ్యాచ్కు భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు హెచ్సీఏకు స్పష్టం చేశారు. వామప్ మ్యాచ్ తేదీని మార్చుకోవాల్సిందిగా కూడా వారు సూచించారు. దాంతో హెచ్సీఏ ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లింది.

ప్రధాన మ్యాచ్ కాదు కాబట్టి సమస్య లేదని, తేదీ మార్చాల్సిన అవసరం లేదని నిర్ణయించాయి. దాంతో ఖాళీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు సూచించినట్లు హెచ్సీఏ వ్యవహారాలు చూస్తున్న జస్టిస్ లావు నాగేశ్వర రావు పీఏ దుర్గా ప్రసాద్ తెలిపారు.
'ఒకే రోజు రెండు పండుగలు రావడంతో భద్రత విషయంలో ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. దాంతో ఈ మ్యాచ్ను ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాకు చెబితే సూత్రప్రాయంగా అంగీకరించారు.
సోమవారం బీసీసీఐకి లెటర్ కూడా రాశాం. బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం.'అని దుర్గాప్రసాద్ చెప్పుకొచ్చారు. అక్టోబర్ 3న ఆస్ట్రేలియా-పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్తో పాటు మూడు ప్రపంచకప్ మ్యాచ్లు ఫ్యాన్స్ మధ్యన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు.