న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో బరిలోకి దిగే నెదర్లాండ్స్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. మరో ఇద్దర్ని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసింది. ఈ జట్టులో భారత సంతతి, ఆంధ్రప్రదేశ్కు చెందిన అనిల్ తేజ నిడమనూరుకు చోటు దక్కింది.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టి న్యూజిలాండ్లో పెరిగిన అనిల్ తేజ.. గత కొంతకాలంగా నెదర్లాండ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్ జట్టును వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ డచ్ నడిపించనున్నాడు. జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో నెదర్లాండ్స్ సంచలన విజయంతో మెగా టోర్నీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ప్రపంచకప్కు అర్హత సాధించాలంటే స్కాట్లాండ్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అసాధారాణ ప్రదర్శన కనబర్చి నెదర్లాండ్స్ సంచలన విజయంతో ప్రపంచకప్ బెర్త్ను సొంతం చేసుకుంది. ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో తెలుగు తేజం అనిల్ తేజ.. వెస్టిండీస్పై అద్భుత సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో నెదర్లాండ్స్ అర్హత సాధించగా.. తొలి సారి వెస్టిండీస్ ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోలేకపోయింది.
అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. నెదర్లాండ్స్ తమ తొలి మ్యాచ్ను హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఆడనుంది. ఆరంభ మ్యాచ్లో పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. నవంబర్ 11న బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్లో భారత్తో తలపడనుంది.
నెదర్లాండ్స్ ప్రపంచకప్ జట్టు:
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), కొలిన్ అకెర్మాన్, షరీజ్ అహ్మద్, వెస్లీ బారెసి, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఎస్ఏ ఎంగెల్బ్రెచ్ట్, ర్యాన్ క్లెయిన్, బాస్ డి లీడే, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, తేజ నిడమనూరు, మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్.